Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..
అరకు అడవిలో కలకలం రేగింది. గంజాయి భారీగా పట్టుబడింది. 30 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పంకజ్ కుమార్ దివేది ఆధ్వర్యంలో ఆపరేషన్ జరగ్గా.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా..

అది అరకు ఏజెన్సీ… డుంబ్రిగూడ ప్రాంతం.. ఒక్కసారిగా అలజడి.. వాహనాలు అగాయి… అధికారులు ఆ వాహనాల నుంచి దిగారు.. ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.. అక్కడ ఏం జరుగుతుందో కొంత సమయం వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో- ఎన్సీబీ భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 30 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎన్సిబి అధికారులు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పంకజ్ కుమార్ దివేది ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. స్పెషల్ ఆపరేషన్లో భారీగా పట్టుకున్న హాషీష్ ఆయిల్ విలువ అక్షరాలా 3.75 కోట్లు.
ఈ కేసులో.. కేరళకు చెందిన మనోజ్ మ్యాథ్యు, ఒడిస్సా కు చెందిన సాల్యూ మర్రి, డుంబ్రిగూడకు చెందిన విష్ణువర్ధన్ లను అరెస్ట్ చేశారు. నిందితులు ద్రవ గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో పక్కా ప్లాన్ తో ఎన్సీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల రాకెట్ ఉందా..? ఇందులో ఎరెవరెవరికి సంబంధాలున్నాయి..? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
