సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. సిద్ధూ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మంత్రుల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మంత్రుల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సిద్దరామయ్య ప్రకటించారు. తన సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ అల్పాహార విందు ఏర్పాటు చేసినట్లు మంత్రి పరమేశ్వర తెలిపారు. ఈ సమావేశంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్, సిద్దరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. సిద్దరామయ్య కూడా ఆయనను ఆశీర్వదించి, అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఇండోర్ పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ, రాజీనామా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని సిద్దరామయ్య భావిస్తున్నారు. గవర్నర్ అందుబాటులో లేకపోయినా, ఆయన కార్యదర్శికి లేదా లోక్భవన్లో లేఖను అందజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, రాజీనామా ఆమోదం పొందాలంటే ఆయన వ్యక్తిగతంగా గవర్నర్ను కలవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సిద్దరామయ్య రాజీనామా ప్రకటన వెలువడగానే బెంగళూరు నగరం అంతటా డీకే శివకుమార్కు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీ నుంచి నేరుగా సిద్దరామయ్య నివాసానికి చేరుకున్న డీకే, దాదాపు అరగంట పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు.
సిద్దరామయ్య ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి పరమేశ్వర స్పందిస్తూ, అది పూర్తిగా హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాసేపట్లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ సంయుక్తంగా నిర్వహించబోయే మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మార్పుతో కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
