అందమైన అమ్మాయి అని నమ్మితే అడ్రస్ లేకుండా పోతారు.. టెకీ నుంచి రూ.1.66 కోట్లు కాజేసి కి‘లేడీ’!
ఈ కాలంలో స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన గుప్పిట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, అదే స్మార్ట్ఫోన్ అజాగ్రత్తగా ఉంటే మన జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును క్షణాల్లో మాయం చేస్తుంది. ముఖ్యంగా డేటింగ్ యాప్ల ద్వారా జరిగే మోసాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందమైన యువతి మాటలు నమ్మి ఏకంగా రూ. 1.66 కోట్లు పోగొట్టుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది.

ఈ కాలంలో స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన గుప్పిట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, అదే స్మార్ట్ఫోన్ అజాగ్రత్తగా ఉంటే మన జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును క్షణాల్లో మాయం చేస్తుంది. ముఖ్యంగా డేటింగ్ యాప్ల ద్వారా జరిగే మోసాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందమైన యువతి మాటలు నమ్మి ఏకంగా రూ. 1.66 కోట్లు పోగొట్టుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది.
బెంగళూరుకు చెందిన సౌరవ్ దుబే అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిబ్రవరి 15న ‘టాంటన్’ (Tantan) అనే డేటింగ్ యాప్లో రియా అగర్వాల్ అనే యువతిని కలిశాడు. మొదట సాధారణ చాటింగ్తో ప్రారంభమైన వీరి పరిచయం, కొద్ది రోజుల్లోనే సన్నిహితంగా మారింది. నిరంతరం ఆడియో, వీడియో కాల్స్ చేస్తూ రియా అతడిని మాయమాటలతో బుట్టలో వేసుకుంది. అతడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన వలలో పూర్తిగా చిక్కుకునేలా చేసింది.
సౌరవ్ తనను పూర్తిగా నమ్ముతున్నాడని గ్రహించిన రియా, అసలు ప్లాన్ అమలు చేసింది. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే కోట్ల రూపాయల లాభాలు వస్తాయని అతడికి ఆశ చూపింది. రియా మాయమాటలు నమ్మిన ఆ టెకీ, మూడు నెలల కాలంలో వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా 1.66 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశాడు.
కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన సౌరవ్కు కేవలం రూ. 4,250 మాత్రమే వెనక్కి వచ్చాయి. తన లాభం, అసలు మొత్తం తిరిగి ఇవ్వాలని అతను రియాను కోరగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టింది. అనుమానం వచ్చిన సౌరవ్ గట్టిగా నిలదీయడంతో, ఆమె తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైపోయింది. దాంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన సౌరవ్, బెంగళూరులోని సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
డేటింగ్ యాప్లలో పరిచయమయ్యే అపరిచితులు డబ్బు, పెట్టుబడి లేదా క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడితే వెంటనే అప్రమత్తం కావాలి. ముఖం చూడని వ్యక్తుల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు బదిలీ చేయడం ప్రాణసంకటమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
