Jharkhand: చేతనైతే నన్ను అరెస్టు చేయండి.. ప్రశ్నలతో సమయం వృథా చేసుకోవద్దు.. సీఎం షాకింగ్ కామెంట్స్..
జార్ఖండ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలన్న ఈడీ సమన్లను ముఖ్యమంత్రి..

జార్ఖండ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలన్న ఈడీ సమన్లను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పట్టించుకోలేదు. విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. తాను ఏదైనా నేరం చేసి ఉంటే ప్రశ్నలు ఎందుకని.. వచ్చి నేరుగా అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. అయితే.. మైనింగ్ లీజుల అంశంలో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా సీఎంవో కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కాగా.. దీనిని తీవ్రంగా తీసుకున్న ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం రాంచిలోని తమ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించింది. అయితే ఈడీ విచారణకు సీఎం సోరెన్ వెళ్లలేదు. జార్ఖండ్ ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారన్న సోరెన్.. ఈడీ కార్యాలయం వద్ద బందోబస్తును ఎందుకు పెంచారని ప్రశ్నించారు.
వేధించే కుట్రలో భాగంగా ఈ సమన్లు జారీ చేశారు. గొంతు నొక్కేందుకు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్నారు. ఈ కుట్రలకు తగిన సమాధానం త్వరలోనే చెబుతాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆర్థిక నేరగాళ్ల గురించి పట్టించుకోవడం లేదు. నాకు భయం లేదు. రాష్ట్ర ప్రజలు తలుచుకుంటే ప్రత్యర్థులకు దాక్కోవడానికి చోటు కూడా దొరకదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
– హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి




కాగా.. జార్ఖండ్ లో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అక్రమ మైనింగ్కు సంబంధించి నేరాలను గుర్తించినట్లు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ లీజుల వ్యవహారంలో సోరెన్పై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ఆగస్టు 25 న గవర్నర్కు పంపించింది. దాంతో సోరెన్ సభ్యత్వంపై వేటు పడుతుందని కొద్దినెలలుగా వార్తలు వస్తుండడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..