IAS vs IPS: ఐఏఎస్ రోహిణి వర్సెస్ ఐపీఎస్ రూపాముద్గల్.. సోషల్మీడియాలో పోస్టులో ఒకరిపై మరొకరు దుమ్ము దుమారం..
కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపా ముద్గల్ మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమంటోంది. తాము ఉన్నతాధికారులమని మరిచిపోయి సోషల్మీడియా వేదికగా ట్వీట్వార్ నడిచింది.ఇంతకీ వీరిద్దరికి ఎక్కడ చెడింది..

సోషల్మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు.. రోహిణిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించిన రూపా.. ప్రస్తుతం రూపా హోంగార్డ్స్ ఐజీ, ఎండోమెంట్ కమిషనర్గా రోహిణి.. కన్నడనాట ఇద్దరు మహిళా సివిల్ సర్వీస్ అధికారులు మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా ముద్గిల్ ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్లు చేశారు. రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. రోహిణిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ఉన్నతాధికారులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఇష్యూ హాట్టాపిక్గా మారింది. కర్నాటకలో రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్గా ఉన్నారు.
తెలంగాణకు చెందిన IAS అధికారి రోహిణి సింధూరి వ్యవహారం కర్ణాటకలో చాలారోజులుగా వివాదం నడుస్తోంది. మొదట్లో చాలా సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరి తీరు రానూ రానూ వివాదాస్పదమైంది. తాజాగా అదే రాష్ట్రంలో మరో కీలక పోస్టులో ఉన్న ఐపీఎస్ రూపాముద్గల్ కీలక ఆరోపణలు చేశారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐఏఎస్ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. కోవిడ్ టైంలో మైసూర్ కలెక్టర్గా ఉన్న రోహిణి..విలాసవంతమైన స్విమ్మింగ్ ఫూల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఏకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితా రిలీజ్ చేశారు.
ఐపీఎస్ రూపా ముద్గల్ తన ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై ఐఏస్ రోహిణి సింధూరి మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రూపా ముద్గల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. రూపా ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని సెటైర్ వేశారు రోహిణి.




ఇద్దరూ మహిళా సివిల్ సర్వీస్ అధికారులు సోషల్మీడియా వేదికగా రచ్చ రచ్చ చేసుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రూపా ముద్గల్పై , రోహిణి కోర్టుకెళ్లే అవకాశం ఉంది. మొత్తంమీదా ఈ వ్యవహారం కర్నాటక పాలనావర్గాల్లో హాట్టాఫిక్గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం