బాలుడి గొంతులో ఇరుక్కున్న రూ.10 నాణెం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రూ. 10 నాణెంను మింగాడు. అదికాస్త గొంతులోని ఆహార నాళంలో ఇరుక్కుపోయింది. ఊపిరాడక బాలుడు ఇక్కిరిబిక్కిరవడంతో తల్లిదండ్రులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు వెంటనే 15 నిమిషాల వ్యవధిలో తొలగించి అందరినీ ఆశ్చర్య పరిచారు..

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఓ 12 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రూ. 10 నాణెంను మింగాడు. అదికాస్త గొంతులోని ఆహార నాళంలో ఇరుక్కుపోయింది. ఊపిరాడక బాలుడు ఇక్కిరిబిక్కిరవడంతో తల్లిదండ్రులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు వెంటనే 15 నిమిషాల వ్యవధిలో తొలగించి, బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన 12 ఏళ్ల బాలుడు సెప్టెంబర్ 28వ తేదీన ఆడుకుంటూ రూ. 10 నాణెం మింగాడు. దాదాపు 27 మి.మీ. వ్యాసం కలిగిన ఈ నాణెం బాలుడి అన్నవాహికలో ఇరుక్కుపోయి తీవ్రమైన ఛాతీ నొప్పి, మింగడంలో ఇబ్బందిని కలిగించింది. తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన ఫరీదాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఫరీదాబాద్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ నిర్దేశ్ చౌహాన్ నేతృత్వంలో ఎక్స్-రే తీయగా బాలుడి గొంతులో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఆలస్యం చేస్తే అన్నవాహిక చిరిగిపోవడం, ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని భావించి అత్యవసర ఎండోస్కోపీని ఎంచుకున్నారు.
బాలుడు ఆస్పత్రికి వచ్చిన గంటలోపే కేవలం 15 నిమిషాల్లోనే రూ. 10 నాణెం తొలగించారు. అదే రోజు సాయంత్రానికి బాలుడిని డిశ్చార్జి కూడా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిర్దేశ్ చౌహాన్ మాట్లాడుతూ.. పిల్లలు ఎక్కువగా పొరబాటున నాణెలు నోట్లో పెట్టుకుని మింగుతుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు.. పిల్లల చేత బలవంతంగా వాంతులు చేయించడం, ఆహారం ఇవ్వడం వంటి ఇంటి చిట్కాలు అనుసరించకూడదు. ఇవి మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. తద్వారా ఆ వస్తువు ఆహార పైపులోకి వెళ్తాయి. బదులుగా వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం సురక్షితమైన మార్గం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




