Cheetahs: చీతాలు వచ్చేశాయి.. ఏడు దశాబ్ధాల తర్వాత ప్రధాని మోదీ పుట్టినరోజు నాడు..

PM Modi Birthday: చీతాలు భారత్ కు వచ్చేశాయి. ఏడు దశాబ్ధాల తర్వాత గంటలపాటు ప్రత్యేక విమానంలో ప్రయాణించి మళ్లీ భారత్ లో అడుగుపెట్టాయి. ప్రత్యేక విమానంలో చీతాలు వచ్చాయంటే ఎవరో అతిథి దేశానికి..

Cheetahs: చీతాలు వచ్చేశాయి.. ఏడు దశాబ్ధాల తర్వాత ప్రధాని మోదీ పుట్టినరోజు నాడు..
Chital
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 17, 2022 | 4:19 PM

PM MODI BIRTHDAY: చీతాలు భారత్ కు వచ్చేశాయి. ఏడు దశాబ్ధాల తర్వాత గంటలపాటు ప్రత్యేక విమానంలో ప్రయాణించి మళ్లీ భారత్ లో అడుగుపెట్టాయి. ప్రత్యేక విమానంలో చీతాలు వచ్చాయంటే ఎవరో అతిథి దేశానికి వచ్చారనుకుంటున్నారా.. అవును ఒక రకంగా ప్రత్యేక అతిథులే కాని.. అవి మనుషులు కాదు. చిరుత పులుల్లో ఒక రకమైన అరుదైన వన్య ప్రాణులు చీతాలు 74 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్‌హాక్‌ నుంచి చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండ్‌ అయ్యింది. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు. చీతాలతో వచ్చిన బృందం చినూక్‌ హెలికాప్టర్‌లో పార్క్‌కు చేరుకుంది. నమీబియా నుంచి మొత్తం 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. చిరుతపులుల్లో ఒక రకమైన చీతాలు గతంలో భారత్ లో ఉండేవి. అయితే 1948 లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలును భారత్ కు తీసుకొచ్చారు. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 72వ జన్మదినం సందర్భంగా నేడు చీతాలు జాతి చిరుతపులులను కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు. ఏడు దశాబ్దాల తర్వాత నమీబియా నుంచి ఈ చీతాలను భారత్ కు తీసుకొచ్చారు. ఇప్పటికే అంతరించిపోయిన చీతాలు జాతిని పునరుద్ధరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈసందర్భంగా పేర్కొన్నారు. వాస్తవానికి వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1972లో ప్రారంభించబడిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ వెంచర్లలో ఒకటి ‘ప్రాజెక్ట్ టైగర్’, పులుల సంరక్షణకు మాత్రమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు కూడా ఈప్రాజెక్టు దోహదపడింది. దీనికి కొనసాగింపుగా, చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..