Pulihora Recipe: పులిహోర అంటే ఇష్టమా .. గుడిలో ప్రసాదం స్టైల్లో తయారు చేసుకోండి .. రెసిపీ
రకరకాల బిర్యానీలు, స్వీట్లు ఉన్నా.. పులిహోర కనిపిస్తే చాలు అందరి దృష్టి అక్కడికే వెళ్తుంది. పండగలు, శుభకార్యాల సమయంలో మాత్రమే కాదు.. మనసు పడితే చాలు వంటింటి నుంచి పులిహోర గుబాళింపులు ముక్కు పుటాలను తాకుతాయి. అంతేకాదు దేవుడి గుడిలో ప్రసాదం రూపంలో కూడా పులిహోరని పంచిపెడతారు. పులిహోర ఇప్పుడు రకరకాలుగా తయారు చేస్తున్నారు. కానీ గుడిలో దొరికే ప్రసాదం రుచితో చింతపండుతో చేసిన పులిహోర అంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలని కోరుకుంటారు. ఈ రోజు గుడిలో దొరికే ప్రసాదం పులిహోర రెసిపీ తెలుసుకుందాం..

దేవుడి గుడి అనగానే పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుందని భక్తులు భావిస్తారు. దేవుడి దర్శనంతో పాటు రుచికరమైన రకరకాల ప్రసాదాలను తినాలని కోరుకుంటారు. ముఖ్యంగా గుడిలో దొరికే పులిహోరని భక్తులు అత్యంత ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లో కూడా ఇదే విధమైన రుచి ఉండే పులిహోర చేసుకోవాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ఆలయాల్లో దేవుళ్ళకు నివేదించే పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
బియ్యం – అర కిలో
చింతపండు – 50 గ్రాములకు పైగా
పచ్చి మిర్చి – 15
పసుపు – రెండు చిన్న స్పూన్లు
జీడిపప్పులు – 30 గ్రాములు
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – 2 టీ స్పూన్లు
మిరియాలు -రెండున్నర టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 2 టీ స్పూన్లు
పచ్చిశనగపప్పు – మూడు టీ స్పూన్లు
మినప్పప్పు – 2 టీ స్పూన్లు
కరివేపాకు – 4 రెమ్మలు
ఎండు మిర్చి – 4
ఇంగువ – పావు టీ స్పూన్
రాళ్ల ఉప్పు – 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నువ్వుల నూనె – కావలసినంత
తయారీ విధానం: ముందుగా చింత పండు గుజ్జు కోసం ఇక గిన్నెలో చింత పండు వేసి వేడి వేడి నీరు పోసి కొంత సేపు నానబెట్టండి. తర్వాత పులిహోర కోసం అన్నం రెడీ చేసుకోవాలి. కుక్కర్ లో బియ్యం పోసి.. తగినంత నీరు పోసి కొంచెం నూనె వేసి మూత పెట్టి.. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత అన్నం తీసి ఒక పళ్ళెంలో వేసి అందులో రెండు స్పూన్ల నువ్వుల నూనె వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సిలో వేసుకుని పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన చింత పండు నుంచి గుజ్జు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నువ్వుల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చి శనగ పప్పు, మినప పప్పు, వేసి వేయించాలి. తర్వాత పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తర్వాత పోపులో చింతపండు గుజ్జు, జీలకర్ర, మిరియాల మెంతుల పొడి మిశ్రమాన్ని వేసి ఉప్పు వేసి బాగా ఉడికించాలి. తరచుగా చింతపండు గుజ్జు కలుపుతూ పలుసుని ఉడికించుకోవాలి. పులుసు రెడీ అయ్యాక దింపు అదే స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి.. నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి.
చల్లారిన అన్నంలో ఉడకబెట్టిన చింతపండు గుజ్జు నెమ్మదిగా కలపాలి. చివరగా జీడిపప్పులు, పచ్చి కరివేపాకు వేసి బాగా కలిపి ఒక గంట పక్కకు పెట్టుకోవాలి. అంతే టెంపుల్ స్టైల్ లో పులిహోర రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..