ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసిన ఆయన, ఇప్పటివరకు పంట కొనుగోళ్లపై రూ.82 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగవైభంగా జరిగాయి.. తెలంగాణ ఆవిర్బావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అనుకున్న సమయాని కంటే గంటన్నర ముందే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలు చేసిన పరేడ్ ఆకట్టుకుంది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించామని.. సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా భావించలేదన్నారు. ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో అధికారం కాదన్నారు. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తమదని వివరించారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటి వరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ.82 వేల కోట్లు చెల్లించామన్నారు. రైతుల నుంచి 10 వేల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిందని.. రూ. 1154 కోట్లు చెల్లించామని తెలిపారు.
తుమ్మడిహెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నాం..
తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వేదికల్లో పోరాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మడిహెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత పదేళ్లలోనూ తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదని పేర్కొన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్కు తిరిగి ప్రాణం పోస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
లైవ్ వీడియో చూడండి..
దేశానికి దిక్సూచిగా తెలంగాణ: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. సాంస్కృతిక వైభవం, పారిశ్రామికాభివృద్ధి, పట్టుదల కలిగిన ప్రజలతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని, రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన తన సందేశంలో పిలుపునిచ్చారు.
అంతకుముందు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతి సంవత్సరం.. నిన్నటి త్యాగాలను స్మరిస్తూ.. రేపటి లక్ష్యాలను సమీక్షించుకునే భావోద్వేగ సందర్భం జూన్ 2 అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
