Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అనౌన్స్మెంట్.. వారందరికీ పండుగే..
ఇందిరమ్మ ఇళ్లపై సీం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త తెలిపారు. కొత్తగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు.

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. కాగజ్ నగర్లో పలు అభివృద్ది పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందించారు. రాష్ట్రంలోని పేదలకు మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను కొత్తగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీన మరో లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని వెల్లడించారు. పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందని రేవంత్ పేర్కొన్నారు.
కేంద్రానికి రేవంత్ వార్నింగ్
తండాలు, గూడేల్లో నివసించే ఆదివాసీలను గుర్తించి అందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గుడిసెలు ఉండకూడదని, ప్రతీఒక్కరూ సొంతిల్లు కలిగి ఉండాలనేది తమ లక్ష్యమని చెప్పారు. మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఈ బహిరంగ సభ వేదికగా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అటు వడ్ల కొనుగోలుపై కేంద్రానికి రేవంత్ సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, జొన్నలు, మక్కలను కేంద్రం కొనుగోలు చేయాలని, లేకపోతే కేంద్రంపై యుద్దం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం కొనుగోలు చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో జూన్ 15 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని, అప్పటిలోలా కేంద్రం కొనుగోలు చేయాలని సూచించారు. ఇప్పటివరకు 62 లక్షల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసినట్లు రేవంత్ స్పష్టం చేశారు.
