Video: 30 ఏళ్ల కల.. ట్రైన్తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
రండి రండి.. దయచేయండి.. మీ రాక మాకు ఎంతో సంతోష సుమండీ.. అంటూ రైల్వే అధికారులకు ఆ ఊరి ప్రజలు స్వాగతం పలికారు. గత 30 ఏళ్ళుగా ప్రకాశంజిల్లా కనిగిరికి రైలు వస్తోంది, వస్తోందంటూ ఊరిస్తున్న ప్రతిపాదనలు నేటికి సాకారమై తొలిసారి రైలు రావడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సెలబ్రిటీతో ఫోటోలు దిగిన విధంగా రైలుతో సెల్ఫీలు దిగి తెగ మురిసిపోయారు స్థానికులు.

ప్రకాశంజిల్లాలోని కనిగిరి అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలన్నా కేవలం రోడ్డు మార్గమే గతి. నడికుడి నుంచి శ్రీ కాళహస్తి వరకు రైలుమార్గం నిర్మిస్తే కనిగిరి ప్రాంతానికి రైలు ప్రయాణ సౌకర్యం కూడా లభిస్తుంది. దీంతో ఈ రైలు మార్గం నిర్మాణానికి పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళడంతో ప్రస్తుతం ఈ మార్గంలో రైల్వే లైను నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గూడ్స్ రైలును తొలిసారి పట్టాలపై ప్రయోగాత్మకంగా నడిపారు అధికారులు. నడికుడి నుంచి కొత్తరైలు మార్గం ద్వరా అమరావతిని రాయలసీమ ప్రాంతానికి, అలాగే తిరుపతి వంటి దక్షినాదిలో ఉన్న నగరాలకు అనుసంధానం చేయనుంది. దీంతో కనిగిరి నుంచి సింగరాయకొండ, కావలికి బస్సుల్లో వచ్చి చెన్నై వైపు రైళ్ళల్లో వెళ్ళే వారికి ఈ కొత్త రైలు మార్గం ప్రయాణభారాన్ని మరింత తగ్గించనుంది.
నడికుడి నుంచి శ్రీ కాళహస్తి వరకు నిర్మిస్తున్న ఈ కొత్తరైలు మార్గం కనిగిరి వరకు పూర్తికావడంతో తొలిసారి కనిగిరి వరకు గూడ్స్ రైలును నడిపారు అధికారులు. బిలాస్పూర్ నుంచి వచ్చిన ఈ గూడ్స్ రైల్లో రైల్వే లైను నిర్మాణ పనుల సామాగ్రిని తీసుకొచ్చారు. తొలిసారి తమ ఊరు వచ్చిన రైలును చూసేందుకు స్థానికులు ఆశక్తి చూపించారు. రైలుతో సెల్ఫీలు దిగి తమ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ రైలు మార్గం పూర్తిగా నిర్మించి ప్రయాణీకులను గమ్యాలకు చేర్చే విధంగా రైళ్ళను నడిపేందుకు రైల్వే శాఖ చురుగ్గా పనులు చేస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
