AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ఖర్చుతో ఆకుకూరలను టెర్రస్‌పై ఇలా పెంచుకోవచ్చు..

ఇంట్లో ఆకుకూరలు పెంచడానికి అనువైన కంటైనర్ల ఎంపిక, డ్రైనేజ్ హోల్స్ ఏర్పాటు, మట్టి తయారీ (పాత, కొత్త మట్టికి), విత్తనాలు వేసే విధానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను టెర్రస్ గార్డెన్‌లో సులువుగా, విజయవంతంగా పండించేందుకు ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి..

తక్కువ ఖర్చుతో ఆకుకూరలను టెర్రస్‌పై ఇలా పెంచుకోవచ్చు..
Terrace Gardening
Ram Naramaneni
|

Updated on: May 21, 2026 | 8:53 AM

Share

ఆకుకూరలను ఇంట్లో, ముఖ్యంగా టెర్రస్ గార్డెన్‌లో పెంచడం ఒక స్పెషల్ ఫీలింగ్. అయితే 100% విజయం సాధించడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. మొదట, సరైన కంటైనర్లను ఎంచుకోవాలి. 50 రూపాయల ధరకు లభించే  కొత్త నలుపు రంగు టబ్బులు ఆకుకూరలకు చాలా అనుకూలం. ఇవి లోతుగా ఉండటం వల్ల మొక్కలు బాగా పెరిగి, ఒకేసారి నాటిన విత్తనాల నుంచి నాలుగు నుంచి ఐదు సార్లు పంటను తీసుకోవచ్చు. కంటైనర్లలో డ్రైనేజ్ హోల్స్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఇనప అట్లకాడను వేడి చేసి నాలుగు లేదా ఐదు హోల్స్ చేసుకోవాలి. నీరు బయటకు పోయేలా చూసుకోవాలి. హోల్స్ కింద చిన్న పెంకు ముక్కలు లేదా పగిలిన ప్లాస్టిక్ కంటైనర్ ముక్కలను ఉంచడం వల్ల మట్టి బయటకు పోకుండా నీరు మాత్రమే కిందికి వెళ్తుంది. మట్టి తయారీ అనేది ఆకుకూరల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాత మట్టిని ఉపయోగిస్తున్నట్లయితే, సారాన్ని మెరుగుపరచడానికి బాగా మాగిన పశువుల ఎరువును, మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్లు, వేరు పురుగు సమస్యలను నివారించడానికి ఒక గుప్పెడు వేపపిండిని కలపాలి. వేపపిండి ఎక్కువగా వాడకూడదు, ఇది మొక్కలకు వేడిని కలిగించి చనిపోయేలా చేయవచ్చు.

మట్టి నల్లగా, సారవంతంగా కనిపించడానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ క్రమం తప్పకుండా వాడటం మంచిది, ఇది ఎర్త్ వార్మ్స్ వృద్ధికి కూడా తోడ్పడుతుంది. కొత్తగా మట్టిని ఉపయోగిస్తున్నప్పుడు, ఒక భాగం మట్టి, ఒక భాగం బాగా మాగిన పశువుల ఎరువు, ఒక భాగం కొబ్బరి పొట్టు, కొద్దిగా వేపపిండి, అలాగే కొద్దిగా ఇసుకను కలపాలి. ఇసుక కలుపడం వల్ల డ్రైనేజ్ మెరుగుపడి, విత్తనాలు పడిపోకుండా మొలకెత్తుతాయి. కంటైనర్లను మట్టితో నింపిన తర్వాత, విత్తనాలు నాటడానికి ముందు మట్టిని బాగా తడుపుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ నుండి నీరు కిందకు వచ్చేంత వరకు నీరు పోయాలి. విత్తనాలు వేసిన తర్వాత నీరు పోస్తే మట్టిలో గాలి గ్యాప్స్ వల్ల విత్తనాలు లోపలికి వెళ్లి మొలకెత్తడం కష్టం అవుతుంది, కొన్నిసార్లు అసలు మొలకెత్తవు. పాలకూర, తోటకూర (ఎరుపు, ఆకుపచ్చ), కొత్తిమీర, మెంతులు వంటి ఆకుకూరల విత్తనాలను చల్లవచ్చు. పాలకూర విత్తనాలను పలుచగా చల్లడం లేదా చిన్న కాలువలు చేసుకుని ఆ గాడులలో వేయడం ద్వారా పడిపోకుండా పెరుగుతాయి. విత్తనాలు వేసిన తర్వాత పలుచని మట్టి పొరతో కప్పాలి. ఈ పద్ధతులు పాటించడం ద్వారా ఇంట్లో ఆరోగ్యకరమైన, తాజా ఆకుకూరలను సమృద్ధిగా పండించుకోవచ్చు.

పూర్తి వివరాలకు దిగువన వీడియో చూడండి..

Follow Us