Sumanth Akkineni : అక్కినేని హీరో సుమంత్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు సుమంత్. ”మళ్ళీ రావా” వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్(Sumanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్క్లూజివ్గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్ను దక్కించుకుంది. ఈ నెల 11న సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సుమంత్ మాట్లాడుతూ .. మళ్లీ మొదలైంది సినిమా విడాకుల కథాంశంతో ఉంటుందని చెప్పగానే ఓకే చెప్పేశానని తెలిపారు. కథ చెబుతోన్న సమయంలో ఈ సినిమా విడాకుల కాన్సెప్ట్తో ఉండనుందని తెలపడంతో వెంటనే చేయాలని డిసైడ్ అయ్యాను అన్నారు. ఇలాంటి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని అనుకున్నానని సుమంత్ చెప్పుకొచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యలో సుమంత్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. అలాగే మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. ప్రస్తుత కాలంలో విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి’ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేగాక ఈ విషయంలో తాను దురదృష్టవశాత్తూ.. అనే పదాన్ని వాడాలని అనుకోవడం లేదని, అలా జరుగుతున్నాయంతే అని అన్నారు సుమంత్. ఇక రెండో పెళ్లి విషయానికొస్తే.. రెండో పెళ్లి చేసుకున్నవారు మళ్లీ విడిపోలేక సర్దుకుపోతున్నారు.. ఎందుకంటే రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ముద్ర పడిపోతుందని భయపడతారు. అందుకే రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు సుమంత్.