‘తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.. అది మీ ఖర్మ! నేనిలాగే మాట్లాడతా..’ వివాదంపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్
సగటు ప్రేక్షకుడిని కూడా కడుపుబ్బ నవ్వించే నట కిరిటీ రాజేంద్రప్రసాద్.. ఎలాంటి పాత్ర అయినా అందులో అలవోకగా ఒదిగిపోయి జీవించేస్తారు. అలాంటిది ఆయన గత కొంత కాలంగా కాంట్రవర్సీస్కి కేరాఫ్ అడ్రెస్గా మారారు. ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు నాట పెద్ద దుమారమే రేపుతున్నాయి..

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు నాట అందరికీ సుపరిచితమే. తనదైన టైమింగ్తో కామెడీని పండించే ఆయన నటన.. సగటు ప్రేక్షకుడిని కూడా కడుపుబ్బ నవ్విస్తుంది. ఎలాంటి పాత్ర అయినా అందులో అలవోకగా ఒదిగిపోయి జీవించేస్తారు. అలాంటిది ఆయన గత కొంత కాలంగా కాంట్రవర్సీస్కి కేరాఫ్ అడ్రెస్గా మారారు. ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు నాట పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఎస్వీకృష్ణారెడ్డి బర్త్డే వేడుకలో నటుడు అలీపైనేకాదు మాజీ మంత్రి రోజాపై కూడా నోరు జారారు. ఈ వేడుకకు శ్రీకాంత్, రోజా, ఆమని, ఇంద్రజ, లయ, రవళి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, అలీ, ఉత్తేజ్, శివాజీ రాజా, బండ్ల గణేష్, చంద్రబోస్, అచ్చిరెడ్డి, కాదంబరి కిరణ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. ఇంత మంది నటీనటుల ముందు కనీస మర్యాద లేకుండా రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడారేంటీ? అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నటి రోజాను ‘ఏమే.. నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను కదా..!’ అని అందరి ముందు అనడం ప్రేక్షకులకు సుతారం నచ్చలేదు. ఇక ఆలీని వేదికపైనే తీవ్ర పదజాలంతో మాట్లాడారు. దీనిపై ఇప్పటికే నెటిజన్లు గుర్రు మంటున్నారు. ఆయనకంత నోటి దురుసు ఎందుకటా? అంటూ మండిపడుతున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ తాజాగా స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ఆయన సరదాగా మాట్లాడారని, ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దని అన్నారు. ‘ఆయన పెద్దాయన. ప్లీజ్.. ఎవరూ దీన్ని పెద్దది చేయకండి’ అంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కూడా వివాదంపై నోరు విప్పారు. తాజాగా ఆయన కొత్త మువీ షష్ఠిపూర్తి మువీ ప్రమోషన్ కార్యక్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే..
‘నేను అందరితో సరదాగా ఉంటాను. వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని ఈవెంట్లలో నావాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్లను నేను పొరపాటున అనేసిన కొన్ని మాటలను తప్పు అని అంటున్నారు. నేను ఇలాగే ఉంటాను. ఇలాగే మాట్లాడుతాను. నేనేంటో వాళ్లందరికీ తెలుసు. సరదాగా ఫ్లోలో వచ్చిన మాటలను తప్పుగా అర్థం తీసుకోవడం మీ సంస్కారం. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో నేను మాట్లాడిన వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ కర్మ.. మీ సంస్కారం.. మీద ఆధారపడి ఉంటుంది. అందుకు నేనేం చేయలేను. తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ సంస్కారం. నేనైతే ఇలాగే ఉంటా. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటా.. నేను పరిచయం చేసిన హీరోయిన్, యాక్టర్ గురించి మాట్లాడినా తప్పుగానే అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యని కాబట్టి’ అని చెప్పుకొచ్చారు. కానీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంత చెప్పినా ప్రేక్షకులు మాత్రం ఎందుకో.. ఆయన వయసుకి ఆ విధంగా మాట్లాడటం సరికాదేమోనని సనుగుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.




