ప్రకాశం జిల్లా నేలటూరులో దారుణం.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తులు.. రీజన్ ఏంటంటే
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అతడి మిత్రులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అతడి మిత్రులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మరావుకు అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులుతో ఓ యువతి వ్యవహారంలో గతంలో విబేధాలు ఉన్నాయి. ఈ విబేధాలు తాము పనిచేసే మిరపకోత పనుల దగ్గర కూడా పలుమార్లు బహిర్గతమై గొడవలకు దారి తీశాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకులు అంకమ్మరావుపై కక్ష పెంచుకుని సమయం కోసం వేచిచూశారు..ఈ నేపధ్యంలో మిర్చికోతల విషయంలో మేస్త్రీతో మాట్లాడేందుకు రావాల్సిందిగా రాత్రి 10 గంటల సమయంలో అంకమ్మరావును ఓ యువకుడు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళాడు. గ్రామం శివారులోని పొలాల్లోకి తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ సిద్దంగా మరో ఇద్దరు యువకులు అంకమ్మరావుతో ఘర్షణకు దిగారు.
అంకమ్మరావును రాళ్ళతో కొట్టి గాయపరిచారు.. అనంతరం ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అంకమ్మరావును అక్కడే వదిలేసి పారిపోయారు. కాలిన గాయాలతో అంకమ్మరావు గ్రామానికి చేరుకుని రోడ్డుపై పడిపోయాడు.. అతడిని గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఒంగోలు రిమ్స్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. 80 శాతం కాలిన గాయాలతో అంకమ్మరావు మృత్యువుతో పోరాడుతున్నాడు. అంకమ్మరావు పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు జడ్జికి సమాచారం అందించారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న అంకమ్మరావు దగ్గరకు వచ్చిన జడ్జి అతని వాంగ్మూలం సేకరించారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఓ యువకుడు అంకమ్మరావును నమ్మకంగా బయటకు తీసుకెళ్ళి ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడి తల్లి చెబుతోంది.
Also Read: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో బుధవారం నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ