ఏపీ సీఎం కీలక నిర్ణయంః ఈ నెల 30న రైతుభరోసా !
లాక్డౌన్ వేళ రైతులకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. పంట సేకరణతో పాటూ కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.

దేశం మొత్తం గడ్డుపరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చినా..దేశానికి నేనున్నాననే భరోసానిచ్చే అన్నదాతకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రైతుల పట్ల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ సర్కార్ కూడా రైతన్నకు మేలు చేసేలా కీలక చర్యలు చేపట్టింది.
లాక్డౌన్ వేళ రైతులకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. పంట సేకరణతో పాటూ కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గతంలో సీఎం సూచనల మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్లో మార్పులు చేర్పులు చేసిన అధికారులు దాని పనితీరు గురించి వైఎస్ జగన్కు వివరించారు. ఈ యాప్కు కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం ఏపీపీ) గా నామకరణం చేశారు.
జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు చూస్తున్న జేసీలు అందరికీ ఈ యాప్పైన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పంటల సేకరణ విధానాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని వెంటనే పరిష్కరించేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్పై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.