AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Class Exams: టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరుగుతాయో.. లేదో..? విద్యార్ధుల్లో అయోమయం

ప్రస్తుతం విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇప్పుడు మరో కొత్త గుబులు పట్టుకుంది. ఏడాదంతా తెలుగు మీడియంలో చదివిన పిల్లలకు పబ్లిక్ పరీక్షలు తెలుగు మీడియంలో జరుగుతాయో.. లేదోనని సందేహంలో పడ్డారు..

AP 10th Class Exams: టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరుగుతాయో.. లేదో..? విద్యార్ధుల్లో అయోమయం
AP 10th Class Exams
Srilakshmi C
|

Updated on: Oct 30, 2024 | 8:04 AM

Share

అమరావతి, అక్టోబర్ 30: రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇప్పుడు మరో కొత్త సందేహం పట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో తెలుగు మాధ్యమంలో పరీక్షలు జరుగుతాయా? లేదా అనేది సందేహంగా మారింది. దీనిపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతం విద్యార్ధుల్లో గుబులు రేపుతుంది. ఇప్పటి వరకూ విద్యాశాఖ తెలుగు మాధ్యమంలో పరీక్షలు నిర్వహణపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల్లోనూ అయోమయం ఏర్పడింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పదో తరగతి విద్యార్ధులందరికీ ఒకే మాధ్యమం అమలు చేయాలని 2021 డిసెంబరు 15న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

2020-21లో ఒకేసారి 1 నుంచి 6 తరగతులకు తెలుగుమాధ్యమాన్ని ఒకేసారి రద్దుచేసి.. ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పాఠ్యాపుస్తకాలు ముద్రించి, ఆంగ్ల మాద్యమంలోనే పాఠ్యాంశాలను కూడా బోధిస్తూ వచ్చారు. వీటిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ జీఓను రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదు. అప్పటి నుంచి తెలుగు మాధ్యమం రద్దు అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయింది.

అయితే 2021 డిసెంబరులో ఒకే మాధ్యమం ఉంటుందంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అది ఆంగ్ల మాధ్యమం అని ప్రత్యేకంగా పేర్కొనకుండానే ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ పాఠశాలల్లో క్రమబద్ధీకరణ జరిపి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించింది కూడా. ఏ మాధ్యమం అమలు చేయాలన్నదానిని ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించకపోవడంతో చాలా చోట్ల ఉపాధ్యాయులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటినీ కొనసాగించారు. ఇలా కొనసాగుతూ వచ్చిన విద్యార్థులు ప్రస్తుతం పదోతరగతిలోకి చేరారు. వీరికి తెలుగు మాధ్యమంలోనే పరీక్షలు నిర్వహించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. గత సర్కార్‌ హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏదైనా ఒక్కటే మాధ్యమం ఉండాలని, రెండు మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తే ఎలా అని ప్రధానోపాధ్యాయులను కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఒక్కటే నిర్వహించకుండా రెండింటిని ఎలా కొనసాగించారంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల తెలుగు, ఆంగ్ల మాధ్యమాల అమలు కావడంతో పదో తరగతి పరీక్షలు ఆంగ్లంలోనే ఉంటాయా? లేదంటే రెండు మాధ్యమాల్లోనూ నిర్వహిస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.