TG EAPCET Counselling 2026: ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు మీనమేషాలు.. ఇంకా కొలిక్కిరాని పేచీ! తప్పని ఎదురుచూపులు
రాష్ట్రంలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రశ్నార్థకంగా మారింది. మే 17న ఫలితాలు విడుదలైనప్పటికీ ఇప్పటివరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. దీంతో బీటెక్లో చేరాలనుకున్న విద్యార్థులకు ఈసారి కూడా నిరీక్షణ తప్పడం లేదు. యేటా ఈఏపీసెట్ ఫలితాలు ముందే వస్తున్నప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం మాత్రం ప్రహసనంలా ఎదురుచూడాల్సి వస్తోంది..

హైదరాబాద్, జూన్ 5: యేటా ముందుగా ఈఏపీసెట్ ఫలితాలు ఇస్తున్నారేగానీ.. కౌన్సెలింగ్ మాత్రం వెంటనే జరపడంలేదు. గత ఏడాది కౌన్సెలింగ్ జాప్యానికి ప్రధాన కారణం గతేడాది కొత్త ఫీజుల యవ్వారం ఇంకా తేలకపోవడమే. అయితే ఈసారి మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై హైకోర్టులో కేసు నడవడం జాప్యానికి కారణమైంది. మరోవైపు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్పై ప్రభుత్వంతో చర్చించి వారంరోజుల్లో విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి గతంలో తెలిపారు. ఇప్పటికి రెండు వారాలు దాటినా పత్తాలేకపోవడం విశేషం.
జులై 16 వరకు తర్వాతే ఈఏపీసెట్ సీట్లు..?
రాష్ట్రంలో ప్రస్తుతం పాలిసెట్ కౌన్సెలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో జులై మొదటివారంలోనే బీటెక్, బీఫార్మసీ సెకండియర్ తరగతులు మొదలవనున్నాయి. పాలిసెట్ తర్వాత ఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా జూన్ 20లోపు వెలువడనున్నాయి. ఎలా చూసినా జూన్ 20వ తేదీ తర్వాతే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈఏపీసెట్ ఫలితాల తర్వాత వెంటనే కౌన్సెలింగ్కు మరో అడ్డంకి ఏమంటే.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో సీట్ల భర్తీకి జరిగే జోసా కౌన్సెలింగ్. యేటా జోసా కౌన్సెలింగ్ చివరివిడత కౌన్సెలింగ్ తర్వాతే ఈఏపీసెట్ తొలివిడత సీట్లను కేటాయించాల్సి వస్తుంది.
Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్ విసిరే చిక్కు ప్రశ్న
అయితే ఈ ఏడాది జూన్ 2న జోసా కౌన్సెలింగ్ మొదలైంది. చివరివిడత వరకు ఆగకుండా రెండో విడత పూర్తయిన తర్వాత ఈఏసీసెట్ కౌన్సెలింగ్ మొదలుపెట్టాలని విద్యార్ధుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు. ఒకవేళ జోసా మిగిలిన రౌండ్లలో సీట్లు వస్తే ఇక్కడ సీట్లు పొందినవారికి సర్టిఫికెట్లు, చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చి పంపేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం జోసా కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి జులై 16 వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ఈఏపీసెట్ తొలివిడత సీట్లు కేటాయించలేమని అంటున్నారు. ఈ ప్రకారంగా చూస్తే జులై 16 వరకు ఈఏపీసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఉండదని తెలుస్తుంది.
తేలని కోర్టు పేచీ
గత మార్చిలో హైకోర్టులో జారీ చేసిన ఫీజు రీయింబర్స్మెంట్పై ఇంజినీరింగ్ కాలేజీలు వెనక్కితగ్గడం లేదు. ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకుంటే 2026-27లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని న్యాయస్థానం ఏప్రిల్లో మధ్యంతర తీర్పు వెలువరించింది. అయితే ప్రభుత్వం మాత్రం తాము విద్యార్థుల ఖాతాల్లో బోధన రుసుములను జమ చేసినప్పుడే యాజమాన్యాలు తీసుకోవాలని, ప్రవేశాల సమయంలో ఒత్తిడి చేయరాదని జీఓ ఇచ్చింది. ప్రవేశాల సమయంలో తీసుకోరాదన్న నిబంధనను తప్పుబట్టిన హైకోర్టు దానిపై స్టే విధించింది. దీనిపై జూన్ 24న కేసు మళ్లీ విచారణ జరగనుంది.




