వీడి కక్కుర్తి తగలెయ్య.. 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్ ఎలా నింపావ్ భయ్యా..! బిల్లు చూసి షాక్..
Petrol Bunk Scam Alert: పెట్రోల్ కొరత కారణంగా చాలా మంది ఎప్పటికప్పుడు తమ వాహనాల ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన కొత్త కారులో పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంకుకు వస్తే ఊహించని షాక్ ఎదురైంది. కారులో ఉన్న ట్యాంకుకు 45 లీటర్ల సామర్థ్యం ఉంటే.. ఏకంటా 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బిల్లు ఇవ్వడంతో బిత్తరపోయాడో వ్యక్తి..

కాన్పూర్, జూన్ 1: కొత్తగా కారు కొన్న ఓ వ్యక్తి ట్యాంక్ ఫుల్గా పెట్రోల్ కొట్టిద్దామని దగ్గరిలోని పెట్రోల్ బంక్కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఎదురైన వింత అనుభవం సంచలనంగా మారింది. కేవలం 45 లీటర్ల సామర్థ్యం ఉన్న కారులో ఏకంగా 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బిల్లు ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో పెట్రోల్ బంక్లో భారీగా స్కామ్ జరుగుతున్నట్లు అనుమానించిన బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. జిల్లా యంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
చరణ్ సింగ్ అనే వ్యక్తి ఇటీవలే కొత్త ఫోక్స్వ్యాగన్ విర్టస్ (Volkswagen Virtus) కారును కొనుగోలు చేశాడు. కారును తీసుకున్న అనంతరం పెట్రోల్ కొట్టిద్దామని సమీపంలోని ఓ పెట్రోల్ బంక్కు వెళ్లి ట్యాంకును పూర్తిగా నింపాలని అక్కడ సిబ్బందిని కోరాడు. తొలుత సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్ నింపారు. మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించగా పెద్ద మొత్తంలో ఇంధనం నింపేటప్పుడు రెండు విడతల్లో నింపాల్సి ఉంటుందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. అనంతరం మిగిలిన ఇంధనాన్ని కూడా నింపారు. అనంతరం పెట్రోల్ బంక్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసిన చరణ్ సింగ్ గుడ్లు తేలేశాడు. మొత్తం 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బిల్లులో పేర్కొనడం ఆశ్చర్యానికి గురిచేసింది. 45 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్ ఎలా పడుతుందని ఆయన సిబ్బందిని ప్రశ్నించాడు.
పెట్రోల్ బంక్ సిబ్బంది తికమక సమాధానాలు చెప్పడంతో ఇది సాధారణ పొరపాటు కాదని, పక్కా మోసంగా భావించిన చరణ్ సింగ్.. వెంటనే కారు తయారీ సంస్థ ప్రతినిధిని సంఘటన స్థలానికి పిలిపించాడు. అక్కడికి చేరుకున్న కంపెనీ ప్రతినిధి ఆ మోడల్ కారులో గరిష్టంగా 45 లీటర్ల పెట్రోల్ మాత్రమే పట్టుతుందని స్పష్టం చేశాడు. పెట్రోల్ బంక్ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వకపోవడంతో చరణ్ సింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు పెట్రోల్ బంక్లో భారీ ఎత్తున మోసం జరుగుతోందని ఆరోపించాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా పరిపాలన యంత్రంగం పెట్రోల్ బంక్లోని ఇంధన పంపిణీ యంత్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. డిస్పెన్సింగ్ యూనిట్లలో ఏవైనా సాంకేతిక లోపాలు లేదంటే అక్రమ మార్పులు జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజా ఘటన వెలుగులోకి రావడంతో పెట్రోల్ బంక్లలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంధనం నింపే సమయంలో మీటర్ రీడింగ్స్, బిల్లులను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




