TGSCHE: ఇక బీకాం, ఎల్ఎల్బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్ విధానం.. ఉన్నతస్థాయి సిలబస్!
తెలంగాణ రాష్ట్రంలో బీకాం, బీబీఏ, ఎల్ఎల్బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతస్థాయికమిటీ సిఫారసు చేసింది. సిలబస్ను ఆధునికీకరించి, కొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది..

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి బీకాం, బీబీఏ, ఎల్ఎల్బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్ విధానం అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. సిలబస్ను ఆధునికీకరించి, కొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్గా బాలకిష్టారెడ్డి.. హెచ్సీయూ నుంచి బెల్లంకొండ రాజశేఖర్, ఓయూ నుంచి విద్యాధర్రెడ్డి, జేఎన్టీయూహెచ్ నుంచి సింధు, ఓయూ నుంచి అప్పారావు, ఎంజీయూ నుంచి రమేశ్కుమార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్-హైదరాబాద్ నుంచి ఎస్ రాజేశ్వర్రావు.. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ తొలి సమావేశం మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు చేశారు. కామర్స్, మేనేజ్మెంట్, లా కోర్సుల సిలబస్లో చేయాల్సిన మార్పులపై కమిటీ నివేదికను రూపొందించింది. ఏడాది తర్వాత పలు కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోయినా.. మళ్లీ వీలున్నపుడు చేరేలా ఎంట్రీ-ఎగ్జిట్ విధానాన్ని కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.
నేడు, రేపు జేఈఈ దరఖాస్తుల తప్పుల సవరణకు ఛాన్స్.. పరీక్షలు ఎప్పుడంటే?
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ 2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురు, శుక్రవారాల్లో (ఫిబ్రవరి 27, 28న) అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య తేదీల్లో నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




