GATE 2025 First Ranker: గేట్లో సత్తా చాటిన నెల్లూరు కుర్రోడు.. ఓవైపు జాబ్ చేస్తూనే.. ప్రిపరేషన్
GATE 2025 Result top ranker: లక్ష్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధించొచ్చని మరోసారి రుజువు చేశాడు నెల్లూరు యువకుడు. ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2025) ఫలితాల్లో డాక్టర్ సాదినేని నిఖిల్ చౌదరి టాప్ ర్యాంకులో మెరిశాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్ సాగించి గేట్ పరీక్షలో మెరిశాడు..

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2025) ఫలితాలు ఐఐటీ రూర్కీ బుధవారం (మార్చి 19) విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ పరీక్ష నిర్వహించగా.. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరైనారు. స్కోర్ కార్డులను మార్చి 28 నుంచి మే 31వరకు డౌన్లోడ్కు చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ వెల్లడించింది. అభ్యర్థులు తమ ఎన్రోల్మెంట్ ఐడీ/ఈ-మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వంటి వివరాలను ఎంటర్ చేసి స్కోరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో తెలుగు కుర్రోడు సత్తా చాటాడు.
గేట్-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లక్ష్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధించొచ్చని మరోసారి రుజువు చేశాడు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన డాక్టర్ సాదినేని నిఖిల్ చౌదరి. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేపర్లో మొత్తం 100 మార్కులకు గాను ఏకంగా 96.33 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. గతంలో నీట్ పరీక్ష రాయగా అందులోనూ 57వ ర్యాంకుతో అదరగొట్టాడు. నిఖిల్ ప్రస్తుతం నోయిడాలోని ఎక్స్పర్ట్డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏఐలో ఎంటెక్ చేయాలది తన కల అని, దానిని సాకారం చేసుకోవాలన్న లక్ష్యం కోసం కష్టపడి చదివినట్లు తెలిపాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాడు. ఆఫీస్ పని పూర్తయ్యాక రోజూ నాలుగైదు గంటలు చదివేవాడు. ఇక సెలవు రోజుల్లో అయితే ఏడెనిమిది గంటలు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ సాగించాడు.
నిఖిల్ తండ్రి సాదినేని శ్రీనివాసులు. ఆయన కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. తల్లి బిందు మాధవి సాఫ్ట్వేర్ ఇంజినీర్. తల్లిదండ్రులు విద్యావంతులు కావడంతో నిఖిల్ కూడా చిన్నప్పట్నుంచే చదువుల్లో చురుకుగా ఉండేవాడు. టెన్త్, ఇంటర్ హైదరాబాద్లో చదివాడు. పదో తరగతిలో 9.8 సీజీపీఏ, ఇంటర్లో 98.6 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. 2017లో నీట్ పరీక్షలో 57వ ర్యాంకు, ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలో 22వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. అనంతరం ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2024లో ఐఐటీ మద్రాస్లో డేటా సైన్స్లో ఆన్లైన్లో డిగ్రీ కోర్సు పూర్తి చేశాడు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.