School Timings: స్కూల్ విద్యార్దులకు అలర్ట్.. బడుల పనివేళలు మళ్లీ మారాయ్! కొత్త టైమింగ్స్ ఇవే
రాష్ట్ర వ్యాప్తంగాఉన్న పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తున్నాయి. అయితే తాజాగా మరోమారు బడుల పని వేళలు మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం..

అమరావతి, మార్చి 20: ఆంధ్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగాఉన్న పాఠశాలల్లో ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో కీలక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే..
పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న చోట ఒంటిపూట బడుల సమయాన్ని పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలోనే పాఠశాలలకు విద్యార్థులు వస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51,069 మంది చొప్పున విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు సార్వత్రిక విద్యాపీఠం విద్యార్ధులకు కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. సార్వత్రిక విద్యార్ధులు 30,334 మంది హాజరవుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.