ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్ కల్చర్లోనూ భారీ మార్పులొచ్చాయ్..!
ఉద్యోగం అంటే నిర్ణయించిన సమయానికి మించి పనిచేయడం, కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కూడా ఈమెయిళ్లకు స్పందించడం, తమ విధులకు మించి బాధ్యతలు తీసుకోవడం వంటి అంశాలను ఒకప్పుడు అంకితభావానికి గుర్తుగా భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నేటి జెన్ జెడ్ యువత పని తీరును తమదైన శైలిలోకి మార్చేస్తున్నారు..

హైదరాబాద్, జులై 28: ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిపై తమ దృక్పథాన్ని మార్చుకుంటుండగా, కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంస్థల్లో ‘ఎఫర్ట్ రిసెషన్ (Effort Recession)’ అనే కొత్త ధోరణి కనిపిస్తోంది. అంటే ఉద్యోగులు తమ విధుల్లో భాగం కాని అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గుతోందని నివేదిక వెల్లడించింది.
జాబ్ సెక్టార్లో పెరుగుతున్న Gen Z ప్రభావం
దేశవ్యాప్తంగా సర్వే చేసిన 380 సంస్థల్లో 240 సంస్థలు (63%), గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల అదనపు కృషి తగ్గిందని తెలిపాయి. సగటున ఈ తగ్గుదల 5 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం, ఉద్యోగులు ఎవరూ చెప్పకుండానే ఆలస్యంగా పనిచేయడం, తమ బాధ్యతలకు అతీతంగా సమస్యలను పరిష్కరించడం, స్వచ్ఛందంగా అదనపు బాధ్యతలు స్వీకరించడం వంటి అంశాలనే ‘డిస్క్రెషనరీ ఎఫర్ట్’గా నిర్వచించారు. ప్రస్తుతం భారత ఉద్యోగుల్లో Gen Z వాటా 26 శాతానికి చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే దాదాపు రెండింతలు. ఈ తరం ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయడం కంటే పని-వ్యక్తిగత జీవితం సమతుల్యత, అనువైన పని విధానం, నిరంతర నైపుణ్యాభివృద్ధి, కెరీర్ పురోగతి, అర్థవంతమైన పని, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అధ్యయనం పేర్కొంది. అదే సమయంలో AI ప్రభావంతో ఉత్పాదకతను కొలిచే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. అయితే తాజా నివేదిక ప్రకారం ఉద్యోగుల అదనపు కృషి తగ్గుదల అన్ని రంగాల్లో ఒకేలా ఉండటం లేదు.
ఏ రంగాల్లో ఎక్కువ ప్రభావం?
- రిటైల్ రంగంలో 88%
- ఐటీ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్లో 77%
- నిర్మాణం, రియల్ ఎస్టేట్లో 71%
- తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్)లో కేవలం 44% తగ్గుదల నమోదైందని తెలిపాయి.
ఉద్యోగులు తమ నాయకులు తమ సంక్షేమాన్ని నిజంగా పట్టించుకుంటున్నారని భావిస్తే 99 శాతం మంది అదనపు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటారని అధ్యయనం తెలిపింది. అదే నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఈ సంఖ్య 29 శాతానికి పడిపోతోంది. అలాగే నాయకులు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటే 98 శాతం మంది ఉద్యోగులు అదనపు బాధ్యతలు తీసుకుంటారని, అలాంటి నాయకత్వం లేకపోతే ఈ సంఖ్య 32 శాతానికి మాత్రమే పరిమితమవుతుందని నివేదిక వెల్లడించింది.
నిపుణులు ఏమంటున్నారు?
దట్ కల్చర్ థింగ్ సంస్థకు చెందిన ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ గుర్లీన్ బరువా అభిప్రాయం ప్రకారం ఇది పని పట్ల నిబద్ధత తగ్గిపోవడం కాదని, పనిని చూసే విధానం మారుతున్న సంకేతమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత అంటే కేవలం ఎక్కువ గంటలు పనిచేయడం లేదా ఎప్పుడూ బిజీగా కనిపించడం మాత్రమే కాదు. సమస్యలను సమర్థంగా పరిష్కరించడం, నాణ్యమైన ఫలితాలు ఇవ్వడం, బృందంతో సమన్వయంగా పనిచేయడం కూడా నిజమైన వర్క్ ఎథిక్లో భాగమే అని ఆమె చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం AI కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతోంది. ముఖ్యంగా ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో గంటల కొద్దీ పనిచేయడం కంటే సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతికతను సమర్థంగా వినియోగించడం కీలకంగా మారుతోంది. అలాగే వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్, మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన కారణంగా ఉద్యోగులు తమ వ్యక్తిగత సమయానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. నేటి ఉద్యోగులు అదనపు కృషి చేయడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ, ఆ కృషికి స్పష్టమైన ఉద్దేశం, గుర్తింపు, విశ్వాసం, అర్థవంతమైన పని ఉంటేనే ముందుకు వస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
