AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హాజరు తక్కువైతే మళ్లీ చదవాల్సిందే..!’ స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..

అనారోగ్యం కారణంగా హాజరు శాతం తగ్గడంతో ప్రధాన పరీక్షలకు అనుమతి కోల్పోయిన నల్సార్ ఎంబీఏ విద్యార్థినికి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సానుభూతి పేరుతో విశ్వవిద్యాలయ నిబంధనలను పక్కన పెట్టలేమని స్పష్టం చేస్తూ, హాజరు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని కోర్టు పేర్కొంది..

'హాజరు తక్కువైతే మళ్లీ చదవాల్సిందే..!' స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
Telangana High Court Verdict On Student Attendence
Srilakshmi C
|

Updated on: Jul 28, 2026 | 4:03 PM

Share

హైదరాబాద్, జులై 28: అనారోగ్యం కారణంగా అవసరమైన హాజరు శాతం పూర్తి చేయలేక ప్రధాన పరీక్షలకు అనుమతి కోల్పోయిన ఓ ఎంబీఏ విద్యార్థినికి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. యూనివర్సిటీ నిబంధనలను సానుభూతి పేరుతో పక్కన పెట్టలేమని స్పష్టం చేస్తూ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు విచారన చేపట్టిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. హాజరు కొరత కారణంగా సెమిస్టర్ చివరి పరీక్షలకు అనర్హత పొందిన విద్యార్థులు, విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం సప్లిమెంటరీ పరీక్షలు రాసే అర్హత కూడా కోల్పోతారని తీర్పు వెలువరించారు.

ఏం జరిగిందంటే..?

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో మొదటి సంవత్సరం చదువుతున్న ఎంబీఏ విద్యార్థిని సెమిస్టర్ 2 సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్ ఇవ్వడాన్ని యూనివర్సిటీ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి, మార్చి 2026లో తనకు వైరల్ న్యుమోనియా, దిగువ శ్వాసనాళ ఇన్‌ఫెక్షన్, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు రావడంతో తరగతులకు హాజరు కాలేకపోయానని కోర్టుకు వివరించింది. అందువల్ల హాజరు శాతం తగ్గిందని, అది తన నియంత్రణలో లేని పరిస్థితి అని పేర్కొంది. తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వకపోతే మొత్తం మొదటి సంవత్సరం మళ్లీ చదవాల్సి వస్తుందని, వర్సిటీ నిబంధనల్లో వైద్య కారణాలపై హాజరులో సడలింపు (Condonation) ఇచ్చే అవకాశం ఉందని వాదించింది.

నల్సార్ వాదన ఏమంటే..?

నల్సార్ యూనివర్సిటీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి అని, వైద్య కారణాలతో మినహాయింపు పొందిన విద్యార్థులకు కూడా కనీసం 67 శాతం హాజరు ఉండాలని కోర్టుకు తెలిపారు. విద్యార్థిని హాజరు కేవలం 52 శాతం మాత్రమే ఉందని, అది రెండు పరిమితుల కంటే కూడా తక్కువని వివరించారు. హాజరు కొరతతో ప్రధాన పరీక్షలకు అనర్హత పొందిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు కూడా అవకాశం ఉండదని విశ్వవిద్యాలయ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. అలాగే విద్యార్థిని ముందస్తుగా నిబంధనల ప్రకారం మెడికల్‌ లీవ్‌ కోసం దరఖాస్తు చేయలేదని, ఏప్రిల్ 2026లో జరిగిన ప్రధాన పరీక్షలకు అనుమతించకపోవడాన్ని అప్పట్లో సవాలు చేయలేదని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

నల్సార్ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

విద్యార్థిని చెప్పిన వివరాల ప్రకారం కూడా ఆమె హాజరు 56 శాతం మాత్రమే ఉందని, అది వైద్య మినహాయింపు ఉన్నప్పటికీ అవసరమైన 67 శాతం కంటే తక్కువేనని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా విద్యార్థిని తల్లిదండ్రులు హాజరులో సడలింపు కోరుతూ చేసిన విజ్ఞప్తి జూలై 6న అంటే సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైన రోజే సమర్పించారని కోర్టు గుర్తించింది. ఇప్పటికే జూలై 4న ఆమె మొదటి సంవత్సరం మళ్లీ చదవాల్సి ఉంటుందని యూనివర్సిటీ తెలియజేసినా, ఆ నిర్ణయాన్ని వెంటనే సవాలు చేయలేదని పేర్కొంది. ఈ తీర్పు వల్ల విద్యార్థిని ఒక విద్యా సంవత్సరం కోల్పోవడంతో పాటు ఆర్థిక నష్టం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు అంగీకరించింది. అయినప్పటికీ అలాంటి పరిస్థితులను చూపి విశ్వవిద్యాలయాన్ని తన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. సానుభూతి లేదా సమానత్వం పేరుతో తప్పనిసరి విద్యా నిబంధనలను పక్కన పెట్టలేం. విద్యా సంబంధిత అంశాల్లో కోర్టుల జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసింది.

Follow Us