Kanwar Yatra: కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది? ఎందుకు చేస్తారో తెలుసా?
Kanwar Yatra Start Date: 2026లో శ్రావణ మాసంతో పాటు కన్వర్ యాత్ర కూడా జూలై 30న ప్రారంభమవుతుంది. ఆగస్టు 11న శ్రావణ శివరాత్రితో ముగిసే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది మంది శివభక్తులు గంగాజలాన్ని తీసుకొచ్చి మహాదేవునికి జలాభిషేకం చేస్తారు. కన్వర్ యాత్ర విశిష్టత, తేదీలు, పురాణ గాథ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Kanwar Yatra Significance Telugu: హిందూ మతంలో శ్రావణ మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ మాసం పరమశివుడి ఆరాధనకు అంకితం చేయబడింది. దృక్ పంచాంగం ప్రకారం, ఉత్తర భారతీయులకు 2026లో శ్రావణ మాసం జూలై 30న ప్రారంభమై ఆగస్టు 28న వచ్చే శ్రావణ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఈ నెలంతా దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. “హర హర మహాదేవ్”, “బమ్ బోలే” నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతాయి. భక్తులు శివునికి జలాభిషేకం చేసేందుకు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివస్తారు. ఈ పవిత్ర మాసంలోనే అత్యంత విశిష్టమైన ‘కన్వర్ యాత్ర(కావడి యాత్ర)’ కూడా ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో లక్షలాది మంది శివభక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హరిద్వార్, రిషికేశ్, గోముఖ్ వంటి పవిత్ర క్షేత్రాలకు వెళ్లి గంగాజలాన్ని సేకరిస్తారు. అనంతరం ఆ నీటిని ప్రత్యేకంగా అలంకరించిన కన్వర్ (కావడి)లో భుజాలపై మోసుకుంటూ వందల కిలోమీటర్లు నడిచి తమ ప్రాంతంలోని శివాలయాలకు చేరుకుని మహాదేవునికి జలాభిషేకం చేస్తారు.
కన్వర్ యాత్ర ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది?
2026లో కన్వర్ యాత్ర శ్రావణ మాసం ప్రారంభమైన జూలై 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు ఈ రోజు నుంచే గంగాజలాన్ని సేకరించి తమ యాత్రను మొదలుపెడతారు. ఈ యాత్ర ఆగస్టు 11న వచ్చే శ్రావణ శివరాత్రి రోజున ముగుస్తుంది. మొత్తం 13 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో చివరి రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
శ్రావణ శివరాత్రి ఎందుకు ప్రత్యేకం?
కన్వర్ యాత్రలో శ్రావణ శివరాత్రి అత్యంత ముఖ్యమైన రోజు. హరిద్వార్, రిషికేశ్, గోముఖ్ వంటి పుణ్యక్షేత్రాల నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చిన కన్వరియులు ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేసి తమ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు ఘనంగా నిర్వహిస్తారు.
కన్వర్ యాత్ర వెనుక ఉన్న పురాణ గాథ
పురాణాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో వెలువడిన హాలాహల విషాన్ని లోకక్షేమం కోసం పరమశివుడు తన కంఠంలో నిలిపాడు. దీంతో ఆయన గొంతు నీలిరంగులోకి మారి, శరీరంలో తీవ్రమైన వేడి ఏర్పడింది. ఆ వేడిని తగ్గించేందుకు దేవతలు పవిత్ర గంగాజలంతో మహాదేవునికి అభిషేకం చేశారని కథనం. మరో విశ్వాసం ప్రకారం, పరమశివుడి పరమభక్తుడైన రావణుడు కూడా శ్రావణ మాసంలో గంగాజలాన్ని తీసుకొచ్చి శివునికి జలాభిషేకం చేశాడని చెబుతారు. అప్పటి నుంచే శ్రావణ మాసంలో గంగాజలంతో శివాభిషేకం చేయడం, కన్వర్ యాత్ర చేపట్టడం అనే సంప్రదాయం ప్రారంభమైందని భక్తులు విశ్వసిస్తారు.
నేటికీ ఈ సంప్రదాయం కోట్లాది మంది శివభక్తుల విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతోంది. శ్రావణ మాసంలో గంగాజలంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుందని, జీవితంలోని కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




