Half Day Schools: స్కూల్ విద్యార్ధులకు గుడ్న్యూస్.. రేపట్నుంచే ఒంటిపూట బడులు! కొత్త టైమింగ్స్ ఇవే
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పాఠశాలలకు శనివారం నుంచి ఒంటి పూట బడులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. మొత్తం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో బడుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం..

హైదరాబాద్, మార్చి 14: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీక్షణంగా కాస్తుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన చేశాయి. స్కూల్ విద్యార్ధులకు శనివారం (మార్చి 15) నుంచి ఒంటి పూట బడులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయం 8 గంటల నుంచే బడులు ప్రారంభం కానున్నాయి.
ఇక మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు పని చేయనున్నాయి. ఆ తర్వాత విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపించేస్తారన్నమాట. అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు మాత్రం సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1 గంటట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్ధులకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పట్నుంచంటే..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కూడా ఒంటిపూట బడులపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కూడా మార్చి 15 నుంచే ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నట్లు ఉత్తర్వుల్లో విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. దీంతో బడుల పనివేళల్లో కూడా మార్పులు రానున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మాత్రం మధ్నాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.