Fake Kidnap: బెడిసి కొట్టిన నకిలీ కిడ్నాప్ డ్రామా.. సినీ ఫక్కీలో ట్విస్టులు! చివరికి ఏమైందంటే..
ఓ యువకుడు డబ్బు కోసం సినీ ఫక్కీలో భారీ స్కెచ్ వేశాడు. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కాసేపటికి ఎవరో తనను కిడ్నాప్ చేశారంటూ తండ్రి మొబైల్కి మెసేజ్ చేశాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన తండ్రి ఆగమేగాల మీద పోలీసులను సంప్రదించారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు సంగతి బయటపడంతో అంతా నోరెళ్లబెట్టారు..

లక్నో, మార్చి 13: తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఓ వ్యక్తి సినిమాకి ఏమాంత్రం తీసిపోనిరీతిలో స్కెచ్ వేశాడు. ఎవరో తనను కిడ్నాప్ చేశారంటూ తండ్రి మొబైల్కి మెసేజ్ చేశాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన తండ్రి పోలీసులను సంప్రదించారు. రంగంలోకి పోలీసులు దిగడంతో అసలు సంగతి బయటపడంతో అంతా నోరెళ్లబెట్టారు. ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లా చోటు చేసుకున్న ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అసలింతకీ ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాకు చెందిన ప్రదీప్ చౌహాన్ (28) అనే యువకుడు తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ మార్చి 7వ తేదీన రామ శంకర్ చౌహాన్ ఫోన్కు మెసేజ్ పంపాడు. వెంటనే డబ్బు పంపించాలని, లేదనంటే తనను చంపేస్తారనేది ఆ మెసేజ్ సారాంసం. అనంతరం తన మొబైల్ను స్విచ్ ఆప్ చేశాడు. దీంతో కంగారు పడిన తండ్రి రామ శంకర్ చౌహాన్ తన కుమారుడు ప్రదీప్ కిడ్నాపైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూణేలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలోని హింజెవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రదీప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ఉత్తరప్రదేశ్కు తరలించారు. అయితే పోలీసులు ప్రదీప్ను తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
అసలు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తానే ఇంటి నుండి వెళ్లిపోయానని పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు. తన తండ్రి నుంచి డబ్బు వసూలు చేయడానికే నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ప్రదీప్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే అక్కడి చేరుకున్న తండ్రి హోలీ పండుగ వస్తుందని కుమారుడిని విడుదల చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు తండ్రి రామ శంకర్ చౌహాన్ నుంచి డబ్బు కట్టించుకుని బెయిల్ మంజూరు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.