AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెంపుల్ సిటీలో NSG యాంటీ టెర్రరిస్ట్ డ్రిల్.. సెక్యూరిటీపై కఠిన హెచ్చరికలు..! తప్పక తెలుసుకోండి..

తిరుమల, తిరుపతి భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) ఆధ్వర్యంలో మార్చి 3-5 తేదీలలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. ఈ ఎక్సర్సైజ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం, ఆలయ భద్రత పెంపు, వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించడం లక్ష్యం. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమం.

టెంపుల్ సిటీలో NSG యాంటీ టెర్రరిస్ట్ డ్రిల్.. సెక్యూరిటీపై కఠిన హెచ్చరికలు..! తప్పక తెలుసుకోండి..
Tirumala security
Raju M P R
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 11:58 AM

Share

తిరుమల, తిరుపతి భద్రత పట్ల ప్రభుత్వం మరింత ఫోకస్ చేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహణకు సమాయత్తం అయ్యింది. ఈ నెల 3 నుండి 5 వరకు తిరుమల తిరుపతి లో ఎన్.ఎస్.జి. బృందంతో కలిసి జిల్లా యంత్రాంగం యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ చేపట్టనుంది. జిల్లా కలెక్టరేట్ లో ఈ మేరకు సమన్వయ సమావేశం జరిగింది. మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తోపాటు ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ నిఘా ముఖ్య భద్రతాధికారి మురళీకృష్ణ NSG అధికారులతో సమావేశం అయ్యారు. ఆక్టోపస్ దళాలు, ఎన్ఎస్జి బృందాల సమన్వయంతో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ కు కార్యాచరణ రూపొందించారు. అత్యవసర పరిస్థితులను వాస్తవంగా భావించి ప్రతి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

తిరుపతి జిల్లాలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ ఎక్సర్సైజ్ జరగనుంది. ఈ మేరకు జిల్లా స్థాయిసమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధ్యక్షతన జరగ్గా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రవాణా ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్‌ ఎస్ జీ బృందం నిర్వహించనున్న మాక్ డ్రిల్స్, సెక్యూరిటీ రిహార్సల్స్, అత్యవసర ప్రతిస్పందన చర్యలపై సమగ్ర చర్చ జరిగింది. భారీగా జనసమూహం ఉండే ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతా ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, కమ్యూనికేషన్ సమన్వయం, అత్యవసర వైద్య సహాయం లాంటి అంశాలపై దృష్టి సారించింది.

యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయంతోపాటు వేగవంతంగా సమర్ధవంతంగా చేపట్టాల్సిన చర్యల పై అవగాహన పెరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మార్చి 3న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 4, 5 తేదీలలో తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీవారి ఆలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మెరుగైన భద్రతా ప్రమాణాల నిర్వహణలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఆక్టోపస్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఎయిర్పోర్టు సిబ్బంది తదితరులు పాల్గొంటారన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలని మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ పరిస్థితిని వాస్తవంగా భావించి ప్రతిచర్యలు చేపట్టాలన్నారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. అత్యవసర పరిస్థితికి సంబంధించి పోలీస్ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు ప్రాథమికంగా సమాచారం అందించడం జరుగుతుందన్నారు. భద్రతా చర్యల్లో పాల్గొనే శాఖలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపడతారన్నారు.లోకల్ పోలీస్ తో పాటు ఆక్టోపస్ భద్రతా దళాలు పాల్గొంటాయని ఎన్ఎస్జీ కమాండో ఆపరేషన్ చేపట్టడం జరుగుతుందన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ల వద్ద టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఎస్పీ. లోకల్ పోలీస్ తో పాటు టిటిడి విజిలెన్స్ వింగ్, ఎన్ఎస్జీ బృందం సమన్వయంతో కమాండో ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని, సిసి కెమెరాలు, అవకాశం ఉన్న చోట డ్రోన్ లను ఉపయోగించడం జరుగుతుందన్నారు ఎస్పీ.

మాక్ డ్రిల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే..

ఇక దేవస్థానాల భద్రత అత్యంత ప్రాధాన్యమైనదనిఎన్‌ఎస్‌జీ సూచనల మేరకు సీసీటీవీ నిఘా, యాక్సెస్ కంట్రోల్, సిబ్బంది శిక్షణ వంటి అంశాలను బలోపేతం చేస్తామన్నారు. టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణ.యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ద్వారా భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించి, లోపాలను గుర్తించి, సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లక్ష్యమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమమని స్పష్టం చేశారు. మాక్ డ్రిల్ ను కేవలం భద్రతా చర్యలు పెంపొందించే చర్యలో భాగంగా మాత్రమే నిర్వర్తించడం జరుగుతూ ఉందన్నారు.

మాక్ డ్రిల్ జరుగుతున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీయవద్దని, ఒకవేళ ఎవరైనా వాటిని తీసి సోషల్ మీడియాలో పెట్టడం, వక్రీకరించి రాయడం, దుష్ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టిటిడి సివిఎస్ఓ మురళీకృష్ణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us