ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఈ రైలు ఎక్కలేరయ్యో.. ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత ప్రయాణం.. ఎక్కడో తెలుసా..?
World Highest Rail Line: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ప్రయాణించడం అంటే అది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అదొక గొప్ప సాహసం. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో, మేఘాల మధ్య సాగే ఈ అద్భుత రైలు ప్రయాణం గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. టికెట్ ధర సామాన్యులకు అందుబాటులో ఉన్నా, ఈ ప్రయాణానికి గుండె ధైర్యం మాత్రం పుష్కలంగా ఉండాలండోయ్..!

Qinghai Tibet Railway: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే లైన్గా పేరుగాంచిన క్వింగ్హై-టిబెట్ రైల్వే మార్గం అద్భుతాలకు నిలయం. దాదాపు 1,956 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు మార్గం ప్రయాణికులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. ఈ ప్రయాణంలో రైలు సగటున 4,000 మీటర్ల (సుమారు 13,123 అడుగులు) ఎత్తులో పరుగులు తీస్తుంది. ప్రయాణంలో అత్యున్నత పాయింట్ అయిన ‘టాంగులా పాస్’ వద్ద రైలు ఏకంగా 5,072 మీటర్ల (16,640 అడుగుల) ఎత్తుకు చేరుకుంటుంది. ఆ సమయంలో మనం భూమిపై ఉన్నామా లేక ఆకాశంలో విహరిస్తున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది.
ప్రాణవాయువు పడిపోయే ఎత్తులో అత్యాధునిక రక్షణ..
సాధారణంగా ఇంత ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై కంటే 40 శాతం తక్కువగా ఉంటాయి. శ్వాస తీసుకోవడం చాలా కష్టతరంగా మారుతుంది. అందుకే ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైలులో రెండు రకాల ఆక్సిజన్ వ్యవస్థలు పనిచేస్తాయి. ఈ వ్యవస్థల ద్వారా రైలు లోపల ఆక్సిజన్ పరిమాణాన్ని బయటి వాతావరణం కంటే 23 శాతం అదనంగా పెంచుతారు. అయినప్పటికీ, రైలు గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు ప్రయాణికుల సీట్ల పైన ఉండే ఆక్సిజన్ మాస్క్లు వాటంతట అవే కిందకు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు రైలులోనే ఆసుపత్రి తరహా ఏర్పాట్లు ఉంటాయి.
కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు..
ఆక్సిజన్ సమస్యలు ఉన్నప్పటికీ, కిటికీ గుండా కనిపించే ప్రకృతి దృశ్యాలు ప్రయాణికుల అలసటను మర్చిపోయేలా చేస్తాయి. బీజింగ్, షాంఘై వంటి నగరాల నుంచి ప్రారంభమై టిబెట్ మంచు కొండల గుండా ఈ రైలు సాగుతుంది. నీలిరంగు ఆకాశం కింద తెల్లటి మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు ప్రయాణికులకు మరపురాని జ్ఞాపకాలను మిగిలిస్తాయి. ఈ అద్భుత దృశ్యాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
సామాన్యులకు అందుబాటులో టికెట్ ధరలు..
ఇంతటి సాహసోపేతమైన, విలాసవంతమైన ప్రయాణానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయని అనుకుంటే పొరపాటే. ప్రయాణికుల సౌకర్యార్థం ఇందులో మూడు రకాల తరగతులు ఉన్నాయి:
హార్డ్ సీట్: ఇది అత్యంత చౌకైనది. దీని ధర కేవలం 212 రూపాయలు (360 యెన్లు) మాత్రమే.
హార్డ్ స్లీపర్: దీని టికెట్ ధర సుమారు 425 రూపాయలు (720 యెన్లు).
సాఫ్ట్ స్లీపర్: ఇది అత్యంత విలాసవంతమైనది. ప్రతి క్యాబిన్లో 4 బెర్త్లు, టీవీ స్క్రీన్, టేబుల్, ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక ఆక్సిజన్ అవుట్లెట్ ఉంటాయి. దీని ధర దాదాపు 675 రూపాయలు (1144 యెన్లు).
20 నుంచి 22 గంటల పాటు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
