AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన దేశంలో రోజుకు ఎంత బంగారం అమ్ముడవుతుందో తెలుసా? లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..

Gold Market: భారత్‌లో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అది సంప్రదాయం, పెట్టుబడి, ఆర్థిక భద్రతకు ప్రతీక. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు ఏవైనా బంగారం కొనుగోలు తప్పనిసరి అన్న భావన భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. ఇదే కారణంగా ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఎప్పుడూ ముందువరుసలో నిలుస్తోంది.

మన దేశంలో రోజుకు ఎంత బంగారం అమ్ముడవుతుందో తెలుసా? లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..
India Gold Market
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: May 13, 2026 | 2:36 PM

Share

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ (WGC) తాజా గణాంకాల ప్రకారం, భారత్‌లో రోజుకు సగటున 2.2 టన్నుల బంగారం విక్రయాలు జరుగుతున్నాయి. రోజువారీ బంగారం కొనుగోలు విలువ సుమారు రూ. 2,000 నుంచి రూ.2,200 కోట్ల వరకు ఉంటోందని అంచనా. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 800 నుంచి 900 టన్నుల బంగారం వినియోగంలోకి వస్తోంది. ఈ సంఖ్యలు భారతీయుల బంగారంపై ఉన్న మక్కువను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ వినియోగంలో అత్యధిక భాగం ఆభరణాలదే. మొత్తం బంగారం వినియోగంలో 75 శాతానికి పైగా వాటా జ్యువెలరీదేనని నివేదిక చెబుతోంది. ముఖ్యంగా వివాహాలు, కుటుంబ వేడుకలు, సంప్రదాయాల కారణంగా బంగారు నగల కొనుగోలు భారీగా జరుగుతోంది. మిగిలిన భాగం బంగారు నాణేలు, గోల్డ్ బార్లు, పెట్టుబడి ఉత్పత్తుల రూపంలో వినియోగించబడుతోంది. ఇటీవల గోల్డ్ ETFలు, డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడి మార్గాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.

టాప్‌లో సౌత్‌ స్టేట్స్‌

భారత్‌లో బంగారం కొనుగోళ్లలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు అత్యధికంగా జరుగుతున్నట్లు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సంప్రదాయంగా బంగారం ధరించడం ప్రతిష్ఠగా భావించడం, పెళ్లిళ్లలో భారీగా నగలు కొనుగోలు చేయడం ఇందుకు ప్రధాన కారణాలు.

స్విట్జర్లాండ్ నుంచే అధిక దిగుమతి

అయితే భారత్‌లో వినియోగించే బంగారం ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. దేశీయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటంతో దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారత్‌కు బంగారం సరఫరా చేస్తున్న దేశాల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం వాటా ఆ దేశానిదే. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి 16 శాతం, దక్షిణ ఆఫ్రికా నుంచి 10 శాతం, పెరూ నుంచి సుమారు 8 శాతం బంగారం దిగుమతి అవుతోంది.

సుంకాల పెంపునకు కారణం

ఇక మరోవైపు, పెరుగుతున్న బంగారం దిగుమతులు దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారీ స్థాయిలో విదేశీ కరెన్సీ బయటకు వెళ్తుండటంతో, బంగారం దిగుమతులను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.

బంగారం రేట్ల పెరుగుదల

దిగుమతి సుంకం పెరగడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, దిగుమతి పన్నుల పెంపు వంటి అంశాలు కలిసి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతీయుల బంగారం కొనుగోలు అలవాటులో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు.

ప్రజల్లో తగ్గని విశ్వాసం

ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, భారతీయ కుటుంబాల్లో బంగారం పట్ల ఉన్న విశ్వాసం ఇప్పటికీ తగ్గలేదు. పెట్టుబడిగా, అవసర సమయంలో భద్రతగా, కుటుంబ సంప్రదాయంగా బంగారం కొనుగోలు కొనసాగుతూనే ఉంది. ఇదే భారత్‌ను ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక దేశంగా నిలబెడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us