రాత్రిపూట రైళ్లు స్పీడ్గా ఎందుకు వెళ్తాయో తెల్సా.? అసలు నిజం ఇదిగో..
చీకటిని చీల్చుకుంటూ దూసుకుపోతున్న రైలును చూస్తుంటే ఒక రకమైన థ్రిల్ కలుగుతుంది. పగటిపూట ఉండే ట్రాఫిక్, లోకల్ రైళ్ల రద్దీ రాత్రిపూట ఉండదు. ట్రాక్ ఖాళీగా ఉండటం వల్ల లోకో పైలట్లు ఎటువంటి ఆటంకం లేకుండా రైలును వేగంగా నడపగలరు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

సాధారణంగా మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనిస్తుంటాం. పగటిపూట కంటే రాత్రివేళల్లో రైలు చాలా వేగంగా దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అసలు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కేవలం సైకలాజికల్ కారణాలే కాకుండా, సాంకేతిక, ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
పగటిపూట ట్రాక్ మీద ప్యాసింజర్ రైళ్లు, లోకల్ రైళ్లు వంటివి ఎక్కువగా తిరుగుతుంటాయి. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రిపూట ప్రధానంగా సూపర్ ఫాస్ట్ రైళ్లు మాత్రమే నడుస్తాయి. కాబట్టి ట్రాక్ చాలా ఖాళీగా ఉంటుంది. అంతేకాకుండా, రాత్రివేళల్లో లోకో పైలట్లు సుదూరంగా ఉన్న సిగ్నల్ లైట్లను పగటి కంటే చాలా సులభంగా గుర్తించగలరు. రైల్వే గేట్ల వద్ద కూడా రాత్రిపూట వాహనాల రద్దీ తక్కువగా ఉండటం వల్ల రైళ్లకు గ్రీన్ సిగ్నల్ వేగంగా లభిస్తుంది.
రైల్వే ట్రాక్ల మరమ్మతులు లేదా మెయింటెనెన్స్ పనులు సాధారణంగా పగటిపూట మాత్రమే జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో రైలు వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది. అయితే రాత్రిపూట ఇలాంటి పనులు ఉండవు. కాబట్టి రైళ్లు పూర్తి వేగంతో ప్రయాణించగలవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాత్రివేళల్లో ట్రాక్ మీద మనుషులు లేదా పశువుల సంచారం ఉండదు, ఇది కూడా వేగాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల రైలు చక్రాల శబ్దం, ట్రాక్ మీద వచ్చే ధ్వని మనకు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. దీనివల్ల రైలు చాలా వేగంగా వెళ్తోందని మనం మానసికంగా భావిస్తాం. వాస్తవానికి పగటిపూట కూడా రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పటికీ, బయట ఉండే రద్దీ వల్ల మనం అంతగా గమనించలేము.
