Budget 2025: బడ్జెట్లో రైతులకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు ఉన్నాయి..

కేంద్ర వార్షిక 2025 బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు గుడ్న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రకటించారు. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం కింద కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభించనున్నామన్నారు.
అధికవృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ అని, వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు, ఆరు రంగాల్లో సమూల మార్పులు చేయనున్నట్లు చెప్పారు. అలాగే పీఎం ధన్ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నామని, ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. – పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక రూపొందించామని మంత్రి నిర్మలమ్మ బడ్జెట్లో ప్రకటించారు. పత్తి రైతుల కోసం ఐదు సంవత్సరాల ప్రణాళిక ఉందని, కొత్త రకం పత్తి సాగు కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. బీహార్లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి నిర్మలమ్మ.. అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి