Central Banks: కేంద్రం సంచలన నిర్ణయం… ఇక ఇండియాలో నాలుగు బ్యాంకులే..
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ బ్యాంకుల విలీనం చేపట్టాలని భావిస్తోంది. ఇక నుంచి ఇండియాలో కేవలం నాలుగు జాతీయ బ్యాంకులు మాత్రమే ఉండేలా విలీన ప్రక్రియకు తుది మెరుగులు దిద్దుతోంది. త్వరలో దీనిపై కీలక నిర్ణయం వెలవడే అవకాశముంది.

Banking System: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మార్పుకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకుల మలి విడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఐదేళ్ల క్రితం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12కు తగ్గించారు. అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి నాలుగు బ్యాంకులుగా చేయాలని కేంద్ర ఆర్ధికశాఖ సమాలోచనలు చేస్తోంది. 2026-27 ఆర్ధిక సంవత్సరం కల్లా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చూస్తోంది. అందుకనుణంగా అడుగులు వేస్తోంది.
విలీనం తర్వాత కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా-యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంక్ మాత్రమే ఉండనున్నాయి. అంటే ఇండియాలో ఇక నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను మాత్రమే మనం చూడనున్నామన్నమాట. తొలుత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయనున్నారు. ఆనంతరం వాటిని నాలుగు బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. ఎస్బీఐలో ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ విలీనం చేయనుండగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కలిపి ఒకే బ్యాంక్గా మార్చనున్నారు. ఇక ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీల్లో విలీనం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థికశాఖ విలీన ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తుండగా.. అనంతరం కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు.
కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి ఫైల్ వెళ్లనుంది. అంతేకాకుండా బ్యాంకుల విలీనంపై సెబీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు తయారుచేస్తున్నారు. భారత్కు ప్రపంచస్థాయి బ్యాంకులు అవసరమంటూ ఇటీవల ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో బ్యాంకుల విలీనంపై మళ్లీ చర్చ మొదలైంది. బ్యాంకుల మలి విడత విలీనం మళ్లీ ఉంటుందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.




