AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపటి నుంచి వర్షాలే వర్షాలు.. మూడు రోజులు అప్రమత్తత అవసరం..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపటి నుంచి వర్షాలే వర్షాలు.. మూడు రోజులు అప్రమత్తత అవసరం..
Ap Rains
Ravi Kiran
|

Updated on: Nov 19, 2022 | 9:42 AM

Share

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 20 నుంచి ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడొచ్చునని, అలాగే తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

నవంబర్ 20, 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు 40-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా:

ఏపీ, తెలంగాణ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా టెంపరేచర్‌ పడిపోతోంది. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఇటు కొమురం భీం జిల్లా సిర్పూర్‌(యు)లో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ఏరియాలో పాడేరు,అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇటు చింతపల్లి ఏజెన్సీలో సాయంత్రం నుంచే మంచు కురుస్తోంది. చలిగాలులు వీస్తుండడంతో మన్యం వాసులు వణికిపోతున్నారు. పొగమంచుతో మన్యం తడిచి ముద్దవుతోంది. ఇవాళ, రేపు చలి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి పెరుగుతున్నట్లు వాతావరణశాఖ వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.