AP News: ఏపీలో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు.. ఇదొక్కటే మరో ఎత్తు.. స్పెషల్ ఏంటంటే..?
ఆ నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అక్కడ ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. ప్రతి ఎలక్షన్కు ఓ కొత్త అభ్యర్ధి వస్తుంటారు పోతుంటారు.. కానీ నాని లోకల్.. మళ్లీ విజయం నాదే అంటున్నారా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చేశానని మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెబుతున్నారు.
ఆ నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అక్కడ ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. ప్రతి ఎలక్షన్కు ఓ కొత్త అభ్యర్ధి వస్తుంటారు పోతుంటారు.. కానీ నాని లోకల్.. మళ్లీ విజయం నాదే అంటున్నారా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చేశానని మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెబుతున్నారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఒరగబెట్టిందేంటని ప్రత్యర్ధి ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ది ఎజెండాతోనే తాను గెలుస్తానంటున్నారు కొడాలి నాని. అక్కడ విజయం ఎవరిని వరించనుంది.? కృష్ణా జిల్లా గుడివాడ రాష్ట్రంలోనే రాజకీయ ఉద్దండులకు కేరాఫ్ అడ్రస్. ఈ నియోజకవర్గం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఇక్కడి నుంచే 1983లో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లోనూ సైకిల్ విజయకేతనం ఎగురవేసింది.1989లో కఠారి ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
1983 నుంచి 2009 వరకు గుడివాడలో టీడీపీకి తిరులేని ఆధిక్యం వచ్చేది. అందుకే ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి కావడంతో ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం గుడివాడతో పాటు గుడ్లవల్లేరు, నందివాడ మండలాలున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు. వరుసగా ఐదోసారి ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. అప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. వరుసగా మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్న కొడాలి నాని.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా వైసీపీకి కొడాలి నాని ఓ పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. టీడీపీని తన మాటలతో చీల్చి చెండాడేస్తుంటారు నాని. ఒకప్పుడు తమ పార్టీ బీ ఫాంతో ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ఇప్పుడు తమను ఇష్టానుసారం మాట్లాడతున్నారంటూ ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ నేతలు.
అభివృద్ది, సంక్షేమం ఎజెండాగా ప్రజల్లోకి..
ఇప్పుడు ఐదోసారి ఎన్నికల బరిలో ఉన్నారు కొడాలి నాని. వైఎస్సార్సీపీ నుంచి మూడోసారి ఎన్నికల పోటీలో నిలిచారు. ఈసారి కూడా తనకు తిరుగులేదనే విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తమ నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉందంటున్నారు. పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్లు, 2000 కోట్లతో నియోజకవర్గంలో నగదు బదిలీ ద్వారా అందించిన సంక్షేమ పథకాలు తమకు కలిసొస్తాయంటున్నారు. జగనన్న ఇళ్ల పట్టాలను మొత్తం 23 వేల మందికి ఇచ్చామని నాని చెబుతున్నారు. 320 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్ పనులు, బస్టాండ్, హాస్పిటల్, ఆరోగ్యశ్రీ, నాడు – నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేసామంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉందని చెబుతున్నారు కొడాలి నాని. రోడ్లు, మంచినీటి సమస్యలతో పాటు డ్రైనేజి సమస్య ఉందంటున్నారు. ఇప్పటివరకూ చేసిన అభివృద్దితో పాటు మళ్లీ గెలిస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నట్లు కొడాలి నాని చెప్పారు.
మరోవైపు టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండేళ్ల క్రితం అమెరికా నుంచి వచ్చి టీడీపీలో చేరి వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ నియోజకవర్గంలో జాబ్ మేళాలు, ఉచిత వైద్యపరీక్షల నిర్వహణ ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. కూటమి పొత్తులో రామును అభ్యర్ధిగా ప్రకటించడంతో ఈసారి గెలుపు తనదే అంటున్నారాయన. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. గుడివాడ అభివృద్దిని పట్టించుకోలేదంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తాగడానికి కనీసం మంచినీరు కూడా దొరకడం లేదంటున్నారు. గతంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని.. టీడీపీ తరపున ఏం చేసినా కొత్తగానే ఉంటుందని అంటున్నారు. తనది ఎన్నికల ప్రచారం అనడం కంటే ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఇంటింటికీ తిరుగుతున్న పర్యటన అనాలంటున్నారు వెనిగండ్ల రాము. దారుణమైన పరిస్థితుల్లో ఉన్న గుడివాడను రక్షించడమే తన ధ్యేయం అంటున్నారు. గుడివాడకు తానేమీ చేయలేదని చెబుతున్న టీడీపీ నేతలు.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేసారని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసారని అడుగుతున్నారు కొడాలి నాని.
ప్రతి ఎన్నికలకు ఒక్కో కొత్త అభ్యర్ధిని తీసుకొచ్చి టీడీపీ తనపై పోటీకి నిలబెడుతుందంటున్నారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ టీడీపీ తరపున పోటీ చేసి ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మరో ఎన్నారైకి ఎమ్మెల్యే సీటు అమ్మేసుకున్నారని కొడాలి నాని ఆరోపిస్తున్నారు. ఓటుకి ఐదు, పదివేలు ఇస్తే ప్రజలు ఓటు వేస్తారని భ్రమలో టీడీపీ ఉందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ అభ్యర్ధి గుడివాడ నుంచి వెళ్లిపోతారని ఎద్దేవా చేస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ కేడర్ను పట్టించుకునే వారు కూడా ఉండరని అంటున్నారు. రాజకీయంగా టీడీపీ.. జనసేన నాయకులను విభేదించానే గానీ ఎవరిమీదా ఎలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టలేదంటున్నారు కొడాలి నాని. టీడీపీ – జనసేన కార్యకర్తలు, నాయకులు తనను విరోధిగా చూడరంటున్నారు. కొడాలి నాని మరోసారి గెలవడం పెద్ద కామెడీ అంటున్నారు వెనిగండ్ల రాము. నియోజకవర్గంలో ఏ వార్డు చూసినా ఏ ఊరు చూసినా మంచినీటి సమస్య ఉందంటున్నారు. కొడాలి నాని ప్రచారానికి వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎంపీ బాలశౌరి చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో ఏమీ జరగలేదంటున్నారు. ఈసారి వంద శాతం గుడివాడలో టీడీపీ గెలుస్తుందని ధీమాగా చెబుతున్నారు. గుడివాడలో గెలుపును ఈసారి టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు వైసీపీ కూడా నాని ఐదోసారి గెలిచి తీరుతాడని ధీమాతో ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..