Andhra: ‘గుర్తుకొస్తున్నాయి..’ 25 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి పూర్వ విద్యార్థులు.. భావోద్వేగ దృశ్యాలు
1999 - 2000 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. యోగ క్షేమాలను అడిగి తెలుసుకొని.. చిన్నానాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం ఆదివారం కలుసుకొని ఆత్మీయత పంచుకున్నారు.

మనం పాతిక సంవత్సరాల తరువాత ఎలా ఉంటాము, ముసలి తనం వస్తే మన ముఖం ఎలా ఉంటుంది. చిన్నపుడు నాతో గోళీలు ఆడుకున్న రాము, చిన్న, గోవిందు ఇపుడు ఎలా ఉండి ఉంటారు. అప్పట్లో నేను రోజూ ఆటపట్టించిన మీనా, రింగుల జుట్టు రోజా ఇంకా అలాగే ఉందా ..ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ బాల్య జ్ఞాపకాలు. ఇప్పుడు కొన్ని ఏఐ యాప్లు వచ్చాయి. వాటిలో మన ఫోటో అప్లోడ్ చేస్తే భవిష్యత్లో మనం ఎలా ఉంటామో చెప్పేస్తాయి. ఇలాంటి యాప్స్ ఎన్ని వచ్చినా.. అప్పటి స్నేహితులు అందర్నీ కలిసి వారితో ముచ్చటిస్తూ.. అలనాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటే.. ఆ అనుభూతి వర్ణణాతీతం. అందుకే ఇప్పుడు రీ యూనియన్ పేరుతో బాల్య మిత్రులు, ఒకే చోట చదువుకున్న వ్యక్తులు కలసి గెట్ టూ గెదర్లలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా అలాగే 10వ తరగతి వరకూ కలిసి చదువుకున్న విద్యార్థులు అందరూ పాతికేళ్ల తరువాత కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనాటి మధురస్మృతులు గుర్తుచేసుకున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులను సత్కరించారు. ఈ రీ యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రలో జరిగింది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999 – 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు తాము ఆ పాఠశాలలో చదివి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పాఠశాల ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా తమ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. విద్యార్థులు, ఉపాద్యాయులు 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయారు. పాత స్నేహితులు అందరూ ఒక్క సారిగా కలవడంతో తమ ఆనందాలకు అవధులు లేకుండా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆత్మీయ సత్కారం చేసారు. చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనే తలంపుతో మొదటిగా బీరువాని బహుకరించారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. గోదావరి రుచులతో అందరూ భోజనాలు ముగించుకుని ఇకనుంచి ప్రతి సంవత్సరం పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్కు చెందిన విద్యార్థులంతా సహకరించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉల్లాసంగా గడిపిన పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బరువెక్కిన హృదయాలతో తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..