AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓట్లకే కాదు ప్రచారానికి కూడా తమ ఊరికి రావద్దంటూ నిరసన.. ఎందుకంటే..

ఆ రెండు ఊర్లు ఎన్నికలను బహిష్కరించాయి.. ఓట్ల కోసం తమ ఊర్లకు నేతలు రావద్దంటూ బ్యానర్లు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు, ఓట్లు అడిగేందుకు నాయకులు ఎవరు తమ ఊరికి రావద్దంటూ సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరైనా కొత్తవారు గ్రామానికి వస్తే నినాదాలు చేస్తున్నారు. అసలెందుకు ఆ రెండు ఊర్లు ఎన్నికలను బహిష్కరించాయి. ఎందుకు నేతలెవరు మా ఊరికి రావద్దంటున్నారు.

ఓట్లకే కాదు ప్రచారానికి కూడా తమ ఊరికి రావద్దంటూ నిరసన.. ఎందుకంటే..
Prakasham District
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 15, 2024 | 1:41 PM

Share

ఆ రెండు ఊర్లు ఎన్నికలను బహిష్కరించాయి.. ఓట్ల కోసం తమ ఊర్లకు నేతలు రావద్దంటూ బ్యానర్లు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు, ఓట్లు అడిగేందుకు నాయకులు ఎవరు తమ ఊరికి రావద్దంటూ సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరైనా కొత్తవారు గ్రామానికి వస్తే నినాదాలు చేస్తున్నారు. అసలెందుకు ఆ రెండు ఊర్లు ఎన్నికలను బహిష్కరించాయి. ఎందుకు నేతలెవరు మా ఊరికి రావద్దంటున్నారు. ఆ రెండు ఊర్ల ప్రజల నిరసన వెనుక కారణాలేంటి.

ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం (సియస్‌ పురం) మండలం దర్శి గుంట్ల , బొంతవారి పల్లి గ్రామస్థులు 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించారు. ఆ రెండు గ్రామాల్లో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా రోడ్డు సౌకర్యం కల్పించలేని పాలకులు ఎన్నికల సమయంలో మాత్రమే వస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు గ్రామాలకు రోడ్డు సౌకర్యం దశాబ్దాలుగా కలగానే మిగిలింది. ఎన్నికల వేళ ఎన్నో మాయమాటలు చెప్పి ఆ తర్వాత తమ ఊరు వైపు కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రహదారులు ఏర్పాటు చేయాలి, లేకుంటే తమ ఊర్లోకి రావద్దు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఓట్లు అడిగేందుకు తమ గ్రామాలకు ఎవరు రావద్దంటూ నినాదాలు చేస్తున్నారు. నాయకులు మోసపూరిత మాటలు ఇకపై నమ్మే పరిస్థితిలో తాము లేమని చెబుతున్నారు. తాము చందాలు వేసుకుని రోడ్డుకు మట్టి తోలి బాగుచేసుకుంటే, పంచాయతీ పాలకులు మాత్రం బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని దర్శి గుంట్ల గ్రామానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు వస్తారని, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత తమ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడరని, ఇక తాము ఎందుకు ఓట్లు వేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా పాలకులకు తమ గ్రామాలకు రోడ్డు వేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని దర్శిగుంట్ల, బొంతవారిపల్లి గ్రామాల ప్రజలు నిర్ణయించుకుని గ్రామాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఈ రెండు గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతుందని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..