ఏపీలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. మే 8 వరకు జరగనున్న ప్రక్రియ..
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియడంతో పాటు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే నియోజకవర్గాలు, బూత్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక 13న జరిగే పోలింగ్లో ఓటర్ నాడి ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియడంతో పాటు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే నియోజకవర్గాలు, బూత్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక 13న జరిగే పోలింగ్లో ఓటర్ నాడి ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి అవసరమైన ట్రైనింగ్ను కూడా పలు దఫాల్లో పూర్తి చేసారు. కొన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్ధులు ఎక్కువగా ఉండటంతో ఒకటి కంటే ఎక్కువ ఈవీఎం యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లా సరిహద్దులతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కేంద్ర బలగాలతో తనిఖీలు నిరంతరంగా కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పోలీస్ పరిశీలకులను కూడా ఎక్కువగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేనటువంటి వారితో పాటు పోలింగ్ విధుల్లో ఉన్నవారికి హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 8 లోగా హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలను పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేసారు.
ఓవైపు హోమ్ ఓటింగ్, మరో వైపు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్..
రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన వృద్దులందరికీ ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఇలాంటి వారి సంఖ్య 2లక్షల11వేల 257 ఉంది. ఇక 40 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న వారు 5 లక్షల 17వేల 227 ఉన్నారు. మొత్తం మీద 7 లక్షల 28వేల 484మంది ఓటర్లకు హోం ఓటింగ్కు అవకాశం ఉండగా.. కేవలం 28వేల591 మంది మాత్రమే హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇప్పటికే హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతో పాటు అత్యవసర సర్వీసులు, డ్రైవర్లు, ఫొటో గ్రాఫర్లు, జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఈనెల 4 అంటే శనివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. 6 వ తేదీన అత్యవసర సర్వీసులుతో పాటు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిన వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసారు. ఇక ఈనెల 7,8 తేదీల్లో మిగిలిపోయిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఈనెల 8 లోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కావడంతో ఏపీలో ఓటర్ తీర్పు ప్రారంభం అయినట్లుగా భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..