TDP: రెండు రోజుల్లో సైకిల్ ఎక్కనున్న వైసీపీ నేత.. ఆ నియోజకవర్గ టికెట్ పై టీడీపీలో ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో సీట్ల పంచాయతీ పీక్స్ కి చేరుకుంటోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్నీ చక్కబెట్టుకొస్తూ ముందుకు సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఇంచార్జిల మార్పులో వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. వచ్చే ఎన్నికల్లో సీటు రావడం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
![TDP: రెండు రోజుల్లో సైకిల్ ఎక్కనున్న వైసీపీ నేత.. ఆ నియోజకవర్గ టికెట్ పై టీడీపీలో ఉత్కంఠ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/mla-krishna-prasad.jpg?w=1280)
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో సీట్ల పంచాయతీ పీక్స్ కి చేరుకుంటోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్నీ చక్కబెట్టుకొస్తూ ముందుకు సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఇంచార్జిల మార్పులో వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. వచ్చే ఎన్నికల్లో సీటు రావడం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే కారణం మాత్రం సీటు రాకపోవడం కాదు.. అధిష్టానం సీటు ఇస్తానని చెప్పినా ఇతర కారణాలతో దూరంగా ఉంటున్నానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉన్న సొంతపార్టీ నేతల వల్ల తనకు ఇబ్బంది ఉందని చెప్పుకొచ్చారు. అయితే తాను ప్రజా జీవితంలోనే ఉంటానని.. ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని మీడియా సమావేశంలో చెప్పారు. తనకు తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. త్వరలోనే వసంత కృష్ణ ప్రసాద్ పసుపు కండువా కప్పుకుంటారని క్లారిటీ వచ్చింది. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. తనకు మైలవరం సీటు ఇవ్వాలని వసంత కృష్ణ ప్రసాద్ కోరినట్లు సమాచారం. అయితే వసంతకు మైలవరంతో పాటు పెనమలూరు టిక్కెట్ పైనా సర్వే చేయిస్తుంది టీడీపీ అధిష్టానం.
మైలవరం టిక్కెట్ కోసం ముగ్గురు ఆశావహులు
మైలవరం టిక్కెట్ కోసం తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రస్తుతం ఇక్కడ ఇంచార్జిగా ఉన్నారు. తనదే మైలవరం టిక్కెట్ అంటూ ఉమా చెప్పుకొస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను దేవినేని ఉమా వర్గం వ్యతిరేకిస్తుంది. దీంతో ఈనెల 21 నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు కూడా దేవినేని ఉమా రంగం సిద్దం చేసుకుంటున్నారు. రెడ్డిగూడెం మండలం అన్నారావుపేట నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు దేవినేని ఉమా. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ కంటే ముందు నుంచే ఈ సీటుపై కర్చీఫ్ వేసి ఉంచారు మరో సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు. దేవినేని ఉమాకు బదులు తనకు టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజల్లో తనకు మంచి గుర్తింపు ఉందని చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్లను కూడా కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు బొమ్మసాని సుబ్బారావు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రేపో మాపో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్.. తనకు మైలవరం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటివరకూ దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మాటల యుద్ధం చలరేగింది. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకే పార్టీలోకి రావడంతో ఎలా సర్దుబాటు చేస్తారో అనే ఉత్కంఠ మొదలైంది. అందుకే మైలవరంతో పాటు పెనమలూరు లో కూడా వసంత కృష్ణ ప్రసాద్పై సర్వేలు చేస్తుంది టీడీపీ అధిష్టానం. అటు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు పై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మైలవరంలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. కానీ అభ్యర్థిని బట్టి కూడా గెలుపు ఎలా ఉంటుందనేది కూడా పార్టీ అధిష్టానం నివేదికలు తెచ్చుకుంటుంది. అయితే బొమ్మసాని సుబ్బరావుకు కూడా సర్వేలు అనుకూలంగా వస్తూ ఉండటంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..