Pawan Kalyan: భీమవరం బరిలో జనసేనాని.? సొంత ఇంటి కోసం సెర్చింగ్.!
మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కూటమి గెలుపు ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో దూసుకుపోతున్నాయ్. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు, పవన్ మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి.
![Pawan Kalyan: భీమవరం బరిలో జనసేనాని.? సొంత ఇంటి కోసం సెర్చింగ్.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/pawan-kalyan-6.jpg?w=1280)
మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కూటమి గెలుపు ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో దూసుకుపోతున్నాయ్. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు, పవన్ మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. దాదాపుగా ఈ నెలాఖరున ఇరు పార్టీలు నియోజకవర్గాల వారీగా తమ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో పార్టీ చీఫ్కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారట జనసేన నేతలు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విషయంలో నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ప్రజల్లో ఆ భావన ఉండకుండా చేసేందుకు సొంత ఇంటిని ఏర్పర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ చూస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ భీమవరంలోనే బస చేయనున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపుల నేపధ్యంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్.
గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి పోటీ చేస్తోన్న నేపధ్యంలో కేవలం ఒక నియోజకవర్గం నుంచే పవన్ పోటీ చేయనున్నారట. అది కూడా భీమవరం నుంచేనని జనసేన కేడర్ చెబుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ స్థానికంగా సొంతింటిని ఏర్పర్చుకోవడంపై దృష్టి సారించారట.
అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ పరిధిలోని నాయకులతో శ్రీ @PawanKalyan గారు సమావేశం pic.twitter.com/mSutlY6tTI
— JanaSena Party (@JanaSenaParty) February 18, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..