Tirupati: ఐటీ జాబ్ ఇప్పిస్తామంటే నమ్ముతున్నారా…? మీరు కూడా ఇలానే మోసపోతారు..
వాళ్లంతా నిరుద్యోగ యువకులు..! ఉపాధి కోసం వెతుకుతున్న వేళ ఓ మోసగాడు ఉచ్చులో పడ్డారు. లక్షలు సమర్పించుకున్నారు. మోసపోయానని గుర్తించి.. పోలీసులను ఆశ్రయించారు. ఒక్కరు..ఇద్దరు కాదు..ఏకంగా పదుల సంఖ్యలో బాధితుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు నిందితులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![Tirupati: ఐటీ జాబ్ ఇప్పిస్తామంటే నమ్ముతున్నారా...? మీరు కూడా ఇలానే మోసపోతారు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/chandragiri-police-station.jpg?w=1280)
ఫిబ్రవరి 19: తిరుపతి జిల్లాలో ఇద్దరు కేటుగాళ్లు ఈజీ మనీ కోసం నిరుద్యోగ యువత ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసారు. ఐటి విభాగంలో సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా అవకాశాలు కల్పిస్తామంటూ బురిడీ కొట్టించారు. దాదాపు రూ. 50 లక్షల దాకా కాజేసిన కేటుగాళ్ల బండారం బయటపడటంతో చంద్రగిరి పోలీసుల ను ఆశ్రయించారు బాధితులు. చంద్రగిరి మండలం పాకాలవారిపల్లెకు చెందిన గురుప్రసాద్, రెడ్డప్పలు నిరుద్యోగులకు ఉద్యోగుల పేరుతో మోసం చేశారు. ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.50 లక్షలు కాజేసిన పాశం గురుప్రసాద్ అతని అనుచరుడు రెడ్డప్పలపై చంద్రగిరి పిఎస్కు ఫిర్యాదు అందింది.
ప్రముఖ కంపెనీలలో హెచ్.ఆర్ మేనేజర్ గా పని చేస్తున్నానని నిరుద్యోగులతో పరిచయం చేసుకున్న కేటుగాళ్లు.. ఏకంగా విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఎమ్ కంపెనీల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. బాధితులు నుంచి వేలల్లో మొదలెట్టి లక్షల్లో వసూలు చేసారు. వచ్చిన ప్రతీ ఒక్కరినీ అప్లికేషన్ తో పాటు మనీ కట్టాలని అడిగారు. అడిగిన సొమ్ము మొత్తం అప్లికేషన్ ఫీజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట వసూళ్ళు చేసారు. అనంతరం ఫోన్ ఆఫ్ చేసుకొని పరారయ్యారు.
ఆఫర్ లెటర్ చూసి లక్షలాది రూపాయలు చెల్లించి మోసపోమారు నిరుద్యోగులు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. మోసం చేసిన ఇద్దరి.. స్వగ్రామం చంద్రగిరి మండలం కావటంతో హైదరాబాద్, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల నుంచి చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు బాధితులు. ఇప్పటి వరకు రూ.50లక్షలు కాజేసినట్లు ఆధారాలు చూపుతున్నారు బాధితులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..