PM Modi: దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తే, సహించేదీ లేదు.. కాంగ్రెస్పై మోదీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు.
తెలంగాణలో ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు. పశ్చిమ భారత్లోని ప్రజలు అరబ్బుల మాదిరిగా ఉంటారని శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని థాకరే వారసులుగా చెప్పుకునే వాళ్లు దీన్ని అంగీకరిస్తారా ? అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్ మదిలో విభజన ఆలోచనలే ఉంటాయన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఆంధ్రప్రదేశ్ వికాసం సాధ్యామవుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అనేక సహాజ సంపదకు, ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమ.. సాగు తాగునీరు లేక జనం అల్లాడతున్నారన్నారు. యువత ఉపాధి కోసం వలస పోతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వాలు రావాలన్నారు.
జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదన్న ఆయన, పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం వైసీపీ సర్కార్ పనిచేస్తోందన్నారు. వైసీపీ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైందని మోదీ హెచ్చరించారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని గుర్తు చేసిన మోదీ, పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జలజీవన్ మిషన్కు వైసీపీ సర్కార్ సహకారం అందించలేదని మండిపడ్డారు మోదీ. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే, సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి యువతను ఆదుకుంటామన్నారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన మరింత విస్తరిస్తామన్న మోదీ, రైతుల జీవితాన్ని ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే మార్చగలుగుతుందన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
దేశ, విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని బీజేపీ సర్కార్ రెట్టింపు చేసిందన్నారు మోదీ. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. భారత్.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది. తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అధికారం కోసం ఆ పార్టీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను ఓట్లతో తిప్పికొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…