Bapatla: పొలం కొన్నాను సాక్షి సంతకం పెడుదుగాని రా అని అతడ్ని తీసుకెళ్లాడు – కొన్నాళ్ల తర్వాత
బాపట్ల జిల్లా నిజంపట్నం మండలం హారీస్ పేటకు చెందిన కొపనాతి శ్రీనివాసరావు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వడ్డీ కట్టలేకపోవడం, భూమి కోల్పోవడంతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. బాపట్ల ఎస్పీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎస్పీ తూషార్ డూడీ కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.

బాపట్ల జిల్లా నిజంపట్నం మండలం హారీస్ పేటకు చెందిన కొపనాతి శ్రీనివాసరావు, ఝాన్సీ దంపతులు తమ పిల్లలిద్దరిని తీసుకొని బాపట్ల ఎస్పీ కార్యాలయంకు వచ్చారు. వచ్చిన కొద్దిసేపటికే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆత్మహత్యయత్నానికి వెనుక కారణాలేంటో తెలుసుకున్నారు.
శ్రీనివాసరావుకి గ్రామంలో రెండు ఎకరాల చేపల చెరువులున్నాయి. వాటిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే చెరువుల్లో నష్టాలు రావడంతో మోపిదేవి పోతురాజు వద్ద మూడు లక్షల రూపాయలు అప్పు చేశాడు. వాటికి వడ్డీలు కట్టమని ఒత్తిడి చేశారు. అయితే డబ్బులు లేకపోవడంతో వడ్డీలు కట్టలేకపోయారు. ఈ క్రమంలో ఒక రోజు పోతురాజు… శ్రీనివాసరావు వద్దకు వచ్చి పొలం కొన్నాను సాక్ష్యం సంతకం చేయాలంటూ తీసుకెళ్లాడు. అక్కడ సంతకాలు చేయించుకుని పంపించాడు. కొద్దికాలం తర్వాత పోతరాజు తాను కొనుగోలు చేసిన దానిని మరొకరికి విక్రయించాడు. అయితే ఆ చెరువు శ్రీనివాసరావుదే అన్న విషయం ఆ తర్వాత తెలిసింది. వెంటనే పోతురాజు వద్దకు వెళ్లి దంపతులు ఎందుకు మా భూమి రాయించుకున్నారంటూ ప్రశ్నించారు. నాకు రావాల్సిన డబ్బులు కిందే చెరువు భూమి రాయించుకున్నానని అందులో తప్పేమీ లేదన్నాడు.
ఆ తర్వాత శ్రీనివాసరావు దంపతులు చెరువు కట్ట మీద నుండి తమ మరొక ఎకరం చెరువుకు వెళ్తంటే బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో దంపతులు ప్రాణ భయంతో తమ చెరువుకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే స్థానిక అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ విషయాన్ని ఎస్పీకి చెబుదామని బాపట్ల వచ్చారు. అక్కడే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే ఆసుపత్రి నుండి బాధితులను ఎస్పీ కార్యాలయానికి పిలిపించుకుని వారు చెరువు వెళ్లే సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా దారి ఇచ్చేలా చర్యలు తీసుకోమని ఎస్పీ నిజాంపట్నం పోలీసులకు సూచించారు. దీంతో బాధిత కుటుంబం తమ ఇంటి బాట పట్టింది. అదే సమయంలో ఆత్మహత్యాయత్నం చేయవద్దని.. సమస్య పరిస్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉందని చెప్పారు. బాధితులు సోమవారం కార్యాయలంకు వచ్చి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఎస్పీ తూషార్ డూడీ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..