Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPI Narayana: సీఎం ఫాం హౌస్‌లో ఉంటే అదే రాజధాని అవుతుందా? ఏపీ మంత్రి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్

ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ జాతీయ

CPI Narayana: సీఎం ఫాం హౌస్‌లో ఉంటే అదే రాజధాని అవుతుందా? ఏపీ మంత్రి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్
Cpi Narayana
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 01, 2021 | 1:18 PM

CPI Narayana – AP Capital – Minister Goutham Reddy: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణా సీఎం కేసిఆర్‌ ఫాం హౌస్‌లో ఉంటే అదే రాజధాని అవుతుందా అని నిలదీశారు . ఏపీలో ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ప్రాంతమని వైయస్‌ జగన్‌ కూడా ఒప్పుకున్నారని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారన్నారు. అమరావతి రైతులతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పిన నారాయణ.. ఇది చంద్రబాబు తన కుటుంబం కోసం చేసుకుంది కాదన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని నారాయణ అభిప్రాయపడ్డారు.

అటు, అఫ్గనిస్తాన్‌ విషయాలపైనా నారాయణ స్పందించారు. అమెరికా బలగాలు వెనుతిరగడంతో ప్రస్తుతం టెన్సన్‌ తగ్గిందని, అయితే అప్గాన్‌ సంపదను 20 ఏళ్ళుగా అమెరికా దోచుకెళ్ళిందని నారాయణ అన్నారు. అమెరికా అఫ్గన్‌లో తిష్టవేసింది అక్కడి ప్రజల సంక్షేమం కోసం కాదని, దోచుకునేందుకేనని నారాయణ ఆరోపించారు. అమెరికా అఫ్గన్‌లో తిష్టవేయడమే తప్పు అని అన్నారు. భారత్‌తో అఫ్గన్‌కు ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమైందన్నారు. అమెరికా విధానాలకు గుడ్డిగా భారత్‌ సపోర్ట్‌ చేయడం వల్లే ఆఫ్గన్‌లో భారత్‌ పెట్టుబడులు పెట్టిందని నారాయణ విమర్శించారు.

ఆఫ్గన్ తాజా పరిణామంతో అఫ్గన్‌లో భారత్‌ పెట్టుబడులపై సందిగ్దత నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు నారాయణ. తాలిబన్లను సీపీఐ పార్టీ కూడా నమ్మిందని, అయితే హింసాకాండను సీపీఐ ఎప్పుడూ సమర్ధించదన్నారు. అమెరికా పోతూ పోతూ తమకు సపోర్ట్‌ చేసిన వారి లిస్ట్‌ను తాలిబన్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత విదేశాంగ విధానంలో పలు తప్పులను చేశారన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ వంటి దేశాలతో అంటకాగారన్నారు. ఇజ్రాయిల్‌ రూపొందించిన పెగాసెస్‌ నిఘా సాప్ట్‌వేర్‌ కారణంగా వ్యక్తిగత స్వేచ్చకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

అటు, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఇటీవల చిత్తూరులో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమైన సంగతి తెలిసిందే. చిత్తూరులో మొన్న మీడియాతో మాట్లాడిన నారాయణ.. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి, వేళ్ళు నరికేస్తామని హెచ్చరించారు. చిత్తూరు – తచ్చూరు జాతీయ రహదారి కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు. భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అలా చేస్తే మీ చేతి వేళ్ళు కూడా కట్ చేస్తామని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు నారాయణ.

Read also: Hijras Nuisance: కళ్యాణ మండపాల్లో హిజ్రాల రచ్చ.. అడిగినంత ఇవ్వాలంటూ లొల్లి