AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Lily: లేటుగా అయినా లేటెస్ట్‌గా విరిసిన పువ్వులు.. అరుదైన ఆ అతిధులను చూసేందుకు క్యూ..!

విశాఖలో అరుదైన ఆ పుష్పాలు కనువిందు చేస్తున్నాయి...! చూడ చక్కని వర్ణంతో గుబాళిస్తూ తమ వైపు ఆకర్షిస్తున్నాయి. తన ప్రత్యేక ఆకారంతో తెగ ముద్దొస్తున్నాయి. ఈ సీజన్లో లేటుగా అయినా లేటెస్ట్ గా అతిథిగా వచ్చిన ఆ పూలను ఆసక్తిగా తిలకిస్తున్నారు జనం. ఒకసారి ఆ అరుదైన పుష్పం అందాల విశేషాలను మనమూ ఒకసారి తెలుసుకుందామా...?!

Blood Lily: లేటుగా అయినా లేటెస్ట్‌గా విరిసిన పువ్వులు.. అరుదైన ఆ అతిధులను చూసేందుకు క్యూ..!
Blood lily
Maqdood Husain Khaja
| Edited By: Surya Kala|

Updated on: Jun 03, 2025 | 7:45 PM

Share

ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అతిధిలా ఆకర్షిస్తుంది. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే ఈ పూలు కాబట్టి వాటి రాక కోసం అందరూ ఆత్రుతగా వేచి చూస్తూ ఉంటారు. అవే మే ఫ్లవర్స్…!ఎక్కడో ఏజెన్సీలోనో.. ప్రత్యేక వనాల్లోనూ దర్శనమిచ్చే ఈ అరుదైన పూలు.. ఇప్పుడు విశాఖ నడిబొడ్డున ఓ ఇంటి మిద్దె తోటలో ఆకర్షిస్తున్నాయి. మే ఫ్లవర్స్ కాస్త లేటుగా అయినా లేటెస్ట్ గా వచ్చినందుకు ముచ్చటపడి ఆ అతిధులను చూసేందుకు పోటీ పడుతున్నారు.

పదేళ్ల క్రితం..!

మురళి నగర్ లో నివసిస్తున్న అరుణకుమారి అనే మహిళ ఇంటిపై వివిధ రకాల కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నారు. మిద్దె తోటలా ఆ మొక్కల అలనా పాలన చూస్తున్నారు. అయితే.. పదేళ్ల క్రితం ఈమె ఫ్లవర్ దుంపను తెచ్చి నాటారు. ఆ తర్వాత కొంతకాలంగా.. ప్రతి ఏటా ఈ పూలు పలకరిస్తూ ఉన్నాయి. వీటి రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు అరుణకుమారి, ఆమె కుటుంబ సభ్యులు. అయితే.. ఆమె ఇంట్లో పూచే అరుదైన మే ఫ్లవర్స్ కోసం ఇరుగు పొరుగు వారు స్థానికులు స్నేహితులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మే ఫ్లవర్ పూయగానే తెలుసుకొని.. ఆ అతిథిని చూసేందుకు క్యూ కడుకుంటారు. ఈసారి ఏకంగా ఒకేసారి నాలుగు మే ఫ్లవర్స్ వికసించడంతో అరుణకుమారి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ ఫోటోలు కాస్త వాట్సాప్ సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇక.. ఆ పూలు చూసేందుకు జనం తాకిడి పెరిగింది. సరదాగా మే ఫ్లవర్స్ ను చూస్తూ.. వాటితో సెల్ఫీలు తీసుకుంటూ తెగ ముచ్చట పడిపోతున్నారు జనం. అరుదైన పూలు మొక్కలు పెంచుతున్న అరుణ కుమారిని అభినందిస్తున్నారు. అరుదుగా పూచే అతిధి మే ఫ్లవర్ ను చూసేందుకు మరింతమంది అతిధులు తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందంటున్నారు అరుణకుమారి. మొక్కలను పెంచి పర్యావరణాన్ని తమ వంతు పరిరక్షించాలని కోరుతున్నారు ఆమె.

కోవిడ్ తర్వాత మరింత ప్రాచుర్యంలోకి…!

బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా… మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాల ఉంటే మాత్రం ఆ లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ పూలను చూసిన చిన్నారులు… సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ పూల ఆకారం.. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బ్లడ్ లిల్లీ గా..

మే పూలు స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందినవి. ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు. భారతదేశంలో ఇక్కడి వాతావరణ పరిస్థితుల బట్టి మే నెలలో ఈ పుష్పం విరబూస్తూ ఉంటుంది. అందుకే దీనికి మే ఫ్లవర్ అని పిలుస్తుంటారు.

మారుతున్న వాతావరణంతో..

ఏజెన్సీలో దాదాపు ప్రతి ఇంట్లో మే పూల మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ నగరాల్లో ఈ పూలు కనిపించడం చాలా అరుదు. ఈసారి వింత ఏంటంటే.. వాతావరణ పరిస్థితులు బట్టి ఏజెన్సీలో ముందే ఈ పూలు పూచినా.. విశాఖలో మాత్రం మీ చివరి వారంలో పూచి జూన్ వరకు విరబోస్తూ ఆకర్షిస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఏజెన్సీలో విపరీతంగా ఎండలో పెరగడం.. అదే క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ పూలు విరబుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మే పుష్పాల మొక్కలను ఆకర్షణీయంగా కుండీలలోనూ పెంచుకుంటున్నారు. మే ఫ్లవర్ కి ప్రత్యేకత కూడా ఉంది. గుండ్రంగా ఉండి.. ఒక్కో పుష్పంలో 50 – 200 వరకు చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి. పువ్వు కాండం పొడవు కూడా ఆకర్షణీయంగా 15 నుంచి 20 సెంటీమీటర్లు వరకు ఉంటుంది. ఇదండీ విశాఖలో చూడ చక్కని వర్ణంతో అతిధుల వచ్చి అందరినీ ఆకట్టుకుంటున్న మే పుష్పం విశేషాలు. వాస్తవానికి మేలోనే ఈ పుష్పం విరబూయాల్సి ఉన్న… ఉష్ణోగ్రతలో వాతావరణ పరిస్థితులను బట్టి.. కొన్నిచోట్ల ఏప్రిల్ లోను… మరి కొన్నిచోట్ల ఆలస్యంగా కూడా విరబూస్తూ ఉంటాయి కనువిందు చేస్తూ ఉంటాయి. కాకపోతే ఒకసారి వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ పలకరించేందుకు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుంది. అందుకే ఈ అరుదైన పుష్పంకు రాక కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..