AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఆగని గొడవలు.. కొనసాగుతున్న ఘర్షణలు.. ఈ ప్రాంతాల్లో..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కానీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి

Andhra Pradesh: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఆగని గొడవలు.. కొనసాగుతున్న ఘర్షణలు.. ఈ ప్రాంతాల్లో..
Ap Politics
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2024 | 6:19 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కానీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పల్నాడులోని సహా పలు ప్రాంతాల్లో గొడవల తాలూకా రియాక్షన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగింది. నానిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో నాని సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు వెళ్లిన పులవర్తి నాని వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తతంగా మారింది. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ బాధితులు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ కారుపై దాడి జరగడంతో పరిస్థితులు మారిపోయాయి. రాత్రి నుంచి రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఘటనలో సీఐ మురళీకృష్ణ గాయపడ్డారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు.

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కొత్తగణేషునిపాడులో పోలింగ్ తరువాత ఉద్రిక్తతలు పెరిగాయి. టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు రాత్రంతా గుడిలోనే తలదాచుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, అనిల్‌కుమార్‌ బాధితులను పరామర్శించారు. ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలుసుకుని టీడీపీ కార్యకర్తలు గ్రామాన్ని చుట్టుముట్టారు. కాసు, అనిల్‌ కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. కేంద్రబలగాల సాయంతో ఎమ్మెల్యేల కాన్వాయ్‌ను తరలించారు.

పల్నాడులో తలెత్తిన ఘర్షణలపై వైసీపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులను పెద్ద ఎత్తున మార్చినా.. ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇది పోలీసుల వైఫల్యమని ఆరోపించారు.

మరోవైపు వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించి ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు. దాచేపల్లి మండలంలో పెట్రో బాంబు ఘటన బాధితులను ఆయన పరామర్శించారు. తంగేడ గ్రామంలో వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో కాసు మహేష్ రెడ్డి అనుచరులు గ్రామంలో పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారని విమర్శించారు. నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు.

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోనూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాత్రి పోలింగ్ బూత్‌లో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఘర్షణ మొదలైంది. ఇరువర్గాలు అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నంద్యాల జిల్లాలోనూ టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ నేత హరి ఇంటిపైకి వైసీపీ నేత రమేష్ నాయుడు గొడవకు వెళ్లడంతో వివాదం మొదలైంది. హరి లేకపోవడంతో అతడి అనుచరుడిపై వైసీపీ నేతలు దాడి చేశారు. అయితే టీడీపీ నేత బంధువులు తిరగబడి వైసీపీ నేతలపై ప్రతిదాడి చేశారు.

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రావిచెట్టు సెంటర్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దమ్ముంటే తేల్చుకుందాం రావాలని ఈరోజు వాట్సప్ గ్రూపుల్లో ఇరువర్గాలు సవాల్ చేసుకున్నాయి. టీడీపీ-వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు సీన్‌లోకి ఎంటరవడంతో ఈ హీట్ మరింత పెరిగింది. గొడవ జరిగే అవకాశాలు ఉండటంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us