Andhra Politics: ఏపీమే సవాల్..! టీడీపీ, వైసీపీ మధ్య ‘సిట్’ మంటలు.. తగ్గేదేలే అంటున్న నేతలు..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అరెస్టులు తప్పవంటోంది వైసీపీ. అయితే.. సిట్ కాదు.. ఇంకెన్ని ఎంక్వైరీలు వేసినా నో ఫియర్ అంటోంది టీడీపీ. అసలేంటీ.. సిట్ ఎంక్వైరీ?.. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది?..
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. దీనిపై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంను ఆశ్రయించింది ప్రభుత్వం. విచారించిన జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ జీవోలను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని అభిప్రాయపడింది . సీబీఐ, ఈడీ కూడా దర్యాప్తు చేయవచ్చంటూ చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారణ జరిపి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సూచించింది సుప్రీం కోర్టు
ఏపీ సిట్ దర్యాప్తుపైనున్న స్టేని సుప్రీంకోర్టు ఎత్తివేయడం చరిత్రాత్మకమన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాల దర్యాప్తు విషయంలో కేంద్ర విచారణ సంస్థలు ఇంప్లీడ్ అయినా తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు అమర్నాథ్.
చంద్రబాబు జీవితమంతా స్టేలతోనే వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 1996లోని లిక్కర్ స్కామ్ నుంచి ఇప్పటివరకు ఆయన చరిత్ర అంతా అవినీతిమయమేనన్నారు కారుమూరి.
అయితే.. సిట్ కాదు ఇంకా ఎన్ని ఎంక్వైరీలు వేసినా భయపడేది లేదన్నారు చంద్రబాబు. ఈ నాలుగేళ్లలో చాలా కేసులు పెట్టారని.. అయినా.. ఏం చేయలేకపోయారని విమర్శించారు.
మొత్తంగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది. మరి.. నెక్ట్స్ ఏంటి?.. వైసీపీ నేతలు చెప్తున్నట్లు.. వ్యవహారం నిజంగానే అరెస్ట్ల వరకూ వెళ్తుందా?.. ఎన్నికల వేళ ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది చూడాలి మరి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..