Andhra News: నట్టేట ముంచిన నమ్మకం.. తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన మేనమామకు కష్టం వస్తే తట్టుకోలేకపోయాడు. తాను తప్పా ఇంకేవరూ లేరనుకున్నాడు. తన ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టి మేనమామ కష్టాన్ని తీర్చాడు. అయితే ఆ విషయాన్ని మేనమామ మర్చి పోవడంతో అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ లో మేనమామ మోసం గురించి వివరించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

పెదకాకానికి చెందిన షేక్ సుభాని, ఖాదరాభికి ముగ్గురు పిల్లలు. పెద్దవాడు రఫి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా అహ్మద్ పెదకాకానిలోనే ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో బాగానే జీవిస్తున్న కుటుంబం అది. అయితే అహ్మద్ మేనమామ జబ్బార్ అదే గ్రామంలో ఉంటున్నాడు. తరుచగా ఇంటికి వచ్చే మేనమామ అంటే అహ్మద్ కు అభిమానం ఎక్కువే.. కొద్దీ రోజుల క్రితం జబ్బార్ కు అప్పులు ఎక్కువయ్యాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ల నుండి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఈ క్రమంలో జబ్బార్ అహ్మద్ ఇంటికి వచ్చాడు. అహ్మద్ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే అప్పులు తీర్చుకుంటా అని వేడుకున్నాడు.
మేనమామ కష్టాన్ని చూసి చలించి పోయిన అహ్మద్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అనుకున్నట్లుగా నాలుగు లక్షల రూపాయలను తీసుకొచ్చి మేనమామకు ఇచ్చాడు. ప్రవేట బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చిన అహ్మద్ కు నెలవారీ కిస్తీలు తానే కడతానంటూ జబ్బార్ ఒప్పుకున్నాడు. మొదట రెండు నెలల బాగానే ఇన్ స్టాల్ మెంట్స్ కట్టాడు. ఆ తర్వాత నుండి మాత్రం ఈఎంఐలు కట్టడం మానేశాడు. దీంతో ప్రవేటు బ్యాంక్ అహ్మద్ పై ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది.
బ్యాంకర్ల ఒత్తిడి తట్టుకోలేక అహ్మద్ మేనమామ జబ్బార్ ఇంటికి వెళ్లి తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. అయినా జబ్బార్ స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన అహ్మద్ తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరిపవేసుకొని చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని సూసైడ్ లో స్పష్టంగా పేర్కొన్నాడు. మేనమామ మోసం చేయడంతోనే తాను చనిపోతునట్లు రాసుకున్నాడు. అహ్మద్ మ్రుతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




