Thailand: థాయిలాండ్ ను వణికిస్తున్న నోరు తుఫాన్.. దెబ్బతిన్న 45 వేల ఇళ్లు..
నోరు తుఫాను ధాటికి థాయిలాండ్లో వానలు దంచి కొడుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగడంతో ఊళ్లు మునిగిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సౌత్ ఈస్ట్ ఏసియా దేశాలపై నోరు తెరచింది నోరు తుఫాను.ఇప్పటికే పిలిప్పీన్స్, వియత్నాంలను అల్లకల్లోలం చేసిన ఈ ఉష్ణమండల తుఫాను థాయిలాండ్ను కూడా తాకింది. నోరు తుఫాను ధాటికి థాయ్లాండ్లోని ఉత్తర, ఈశాన్య, మధ్య ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. చావోఫ్రయా, మూన్, పింగ్, యోమ్ నదులు ఉప్పొంది ప్రవహించాయి. అదే సమయంలో ప్రాజెక్టుల నీటిని కూడా విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఇళ్లూ, వాహానాలు, ఆస్తులు నష్టపోవాల్సి వచ్చింది.
థాయ్లాండ్ వ్యాప్తంగా 35 ప్రావిన్స్లోని 45 వేల ఇళ్లు నోరు తుఫాను వరదల ధాటికి దెబ్బతిన్నాయి. పింగ్ నదిప్రవహించే చియాంగ్ మాయి ప్రావిన్స్లోని చారిత్రిక పురావస్తు ప్రదేశం సుఖోథాయ్ వరదల్లో చిక్కుకుంది. మూన్ రివర్ పొంగి ప్రవహించడంతో ఉబోన్ రట్చథాని, నఖోన్ రాట్చాసిమా నగరాలు జలమయం అయ్యాయి. 7 వేల మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 60 షెల్టర్లలోకి తరలించారు.
సహాయక సిబ్బంది నడుంలోతు వరద నీటిలోకి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యోమ్ నది ఒడ్డున ఉన్న సుఖోథాయ్, ఫిట్సానులోక్, ఫిచిత్ల ప్రావిన్స్లలో అధికారులు అత్యవసర వరద హెచ్చరికలు జారీ చేశారు. వాంగ్ హిన్ గ్రామాన్ని ఒక్కసారిగి వరద నీరు ముంచెత్తడంతో ఇక్కడి ప్రజలు పరుగులు తీశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.