China Drought: కరువు కోరల్లో చైనా.. ఎండుతున్న పంటలు.. పెరుగుతున్న ఆకలికేకలు.. పదిమంది మృతి

చైనాలో వర్షాభావ పరిస్థితులు అక్కడి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. వర్షాభావంతో యాంగ్జే మహా నది ఎండిపోవడం దేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీస్తోంది.

China Drought: కరువు కోరల్లో చైనా.. ఎండుతున్న పంటలు.. పెరుగుతున్న ఆకలికేకలు.. పదిమంది మృతి
China Drought
Follow us

|

Updated on: Aug 21, 2022 | 12:36 PM

China Drought: మొన్న ఆఫ్రికా, నిన్న యూకే, నేడు చైనా ఇలా వరుసగా ప్రపంచ దేశాలను కరువు కబలిస్తోంది. ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో కరువు సాధారణమే అయినప్పటికీ అతి సంపన్న శీతల దేశాలను కరువు చుట్టముట్టడం ఆందోళనకర అంశంగా మారింది. తాజాగా చైనా సైతం కరువు కోరల అంచున నిలబడింది. ప్రపంచం మొత్తం కరోనా నుంచి తేలుకున్నా ఇప్పటికీ చైనాలోని చాలా ప్రావిన్స్‌ల్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ క్రమంలో కరువు పంజా విసరడం డ్రాగన్‌కు అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా కరువొచ్చింది.. యాంగ్జీలో కూడా నీరు అడుగంటిపోయింది.. దీంతో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిద్దమయ్యారు అధికారులు. ఆసియాలోనే అతిపెద్ద నది.. చైనాలోని మూడో అతిపెద్ద ప్రావిన్స్‌ సిచువాన్‌లో ప్రవహించే యాంగ్జీ నది దుస్థితిని చూస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే.. నిండుగా ప్రవాహిస్తూ తాగు, సాగు, విద్యుత్‌ అవసరాలను తీర్చే యాంగ్జీ జీవం కోల్పోయింది.. నీటి నిలువలు చాలా దారుణంగా పడిపోయాయి.

సిచువాన్‌ ప్రావిన్స్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అనేక చోట్ల 44 డిగ్రీలు దాలేసింది.. 1961 తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిచువాన్ ప్రావిన్స్‌లోని 51 నదులు, 24 రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. నీళ్లతో కలకలలాడాల్సిన నదులు, రిజర్వాయర్లలో ఇసుకమేటలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా అన్నింటికన్నా ఘోరం యాంగ్జీ నదిదే.. ఈ నదిలో ప్రవాహాలు చిన్నపాటి కాలువలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా జలరవాణాను నిలిపేశారు.. సాగు నీరు అందించే అవకాశం లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. తాగు నీటికి కూడా ఇబ్బందిపడుతున్నారు. మైళ్ల కొద్దీ దూరం నుంచి నీటిని తెచ్చుకుని గొంతులు తడుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

యాంగ్జీ నది సిచువాన్‌ ప్రావిన్స్‌లోని 80 శాతం విద్యుత్‌ అవసరాలు తీర్చేది.. హైడ్రో పవన్‌ జనరేషన్‌కు అవకాశం లేకపోవడంతో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ముంచుకొచ్చింది. అనేక పరిశ్రమలను మూసుకోవాల్సి వచ్చింది. ఫ్యాక్టరీలతో పాటు షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులు కూడా పని చేయడం లేదు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షాల మీద దృష్టి సారించింది చైనా ప్రభుత్వం. యాంగ్జీ నది ప్రవహించే పరిసర ప్రాంతాల్లో క్లౌడ్‌ సీడింగ్‌ ప్రారంభించారు. ప్రత్యేక విమానల ద్వారా సిల్వర్‌ అయోడిన్‌ను మేఘాల్లోకి వదులుతున్నారు. అదే విధంగా కింది నుంచి ఆకాశంలోని మేఘాలపై సిల్వర్‌ అయోడైడ్‌ ఫైర్‌ చేస్తున్నారు. సిచువాన్‌తో పాటు హుబే ప్రావిన్స్‌లో కూడా కరువు పరిస్థితులు ఉండటంతో అక్కడ కూడా క్లౌడ్‌ సీడింగ్‌ చేపట్టారు అధికారులు.. ఈ చర్యలతో కొంతమేరకైనా వర్షం పడుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చైనాలో వర్షాభావ పరిస్థితులు అక్కడి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. వర్షాభావంతో యాంగ్జే మహా నది ఎండిపోవడం దేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీస్తోంది. ఆరు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి కొరత వల్ల హుబై రాష్ట్రంలో 1.7 కోట్ల ఎకరాలలో, సిచువాన్‌లో 1,16,000 ఎకరాల్లో పంట నాశనమైంది. హుబైలో 2,20,000 మంది, సిచువాన్‌ లో 8,19,000 మంది తాగునీరు లేక అల్లలాడుతున్నారు. చోంగ్‌ కింగ్‌ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో 10 లక్షల మందికి తాగునీటి కరువు ఏర్పడింది. ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి తాగునీటిని తెచ్చి ఇళ్లకూ, పశువులకూ సరఫరా చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

చోంగ్‌ కింగ్‌ రాష్ట్రంలో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంకాయలు నీరు లేక స్టాబ్రెరీ సైజుకు కుంచించుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ జలాశయాలు ఎండిపోవడంతో భూగర్భ జలాలను తోడి ఎంతోకొంత పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. ఇక నుంచి ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు ఇలానే పెరుగుతూ పోతే తుంపర సేద్యం చేయక తప్పేలా లేదని రైతులంటున్నారు.

చోంగ్‌ కింగ్‌లో రైతులు ఆగస్టు నెలాఖరులో కానీ, సెప్టెంబరు మొదట్లో కానీ వరి కోతలు ప్రారంభిస్తారు. కానీ, ఈ ఏడాది వర్షాభావం వల్ల రెండు వారాల ముందే పంట కోతలు పూర్తిచేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మధ్య చైనా, తూర్పు టిబెట్‌లలోని వ్యవసాయ రాష్ట్రాలలో అనావృష్టి తీవ్రమైందని జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ తెలిపింది. మరోవైపు వాయవ్య రాష్ట్రం క్వింగ్‌ హాయ్‌లో అతివృష్టి వల్ల వరదలు వచ్చిపడుతున్నాయి. వరదల్లో ఒప్పటికే పదుల సంఖ్యలో మరణించారు. మరికొత మంది ఆచూకి తెలియడం లేదు. ఇప్పటికే దేశంలో కరువు డిక్లేర్‌ చేసింది బ్రిటన్‌. హైటెంపరేచర్స్‌, హీట్‌ వేవ్‌ కారణంగా అనేక ప్రాంతాలు కరువు బారినపడ్డాయని ప్రకటించింది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది బ్రిటన్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..